World Cup 2022:ఖేదం.. మోదం.. ‘హమ్మయ్య భారత్‌ ఓడిపోయింది’.. వెస్టిండీస్‌ సంబరాలు.. వైరల్‌

Women World Cup 2022: West Indies Players Celebrate After Watching IND vs SA Match - Sakshi

ICC Women World Cup 2022: తెలిసో తెలియకో ఒకరికి ఎదురైన పరాభవం మరొకరి పాలిట వరమవుతుంది. ఒకరి బాధ పరోక్షంగా మరొకరి సంతోషానికి కారణం అవుతుంది. ఐసీసీ మహిళా వన్డే ప్రపంచకప్‌-2022లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్‌ భారత్‌, వెస్టిండీస్‌ జట్లకు ఇలాంటి అనుభవాన్నే మిగిల్చింది. మెగా ఈవెంట్‌ సెమీ ఫైనల్‌కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో భారత మహిళా జట్టు ఆఖరి నిమిషంలో ఓటమి పాలైన సంగతి తెలిసిందే.

దీంతో రిక్త హస్తాలతోనే టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. నో బాల్‌ రూపంలో దురదృష్టం వెంటాడంతో మిథాలీ సేనకు భంగపాటు తప్పలేదు. దీంతో భారత జట్టు బాధతో వెనుదిరగగా.. వెస్టిండీస్‌ మాత్రం సంబరాలు చేసుకుంది. ఆఖరి వరకు తీవ్ర ఉత్కంఠ రేపిన దక్షిణాఫ్రికా- భారత్‌ మధ్య జరిగిన మ్యాచ్‌ను వీక్షించిన వెస్టిండీస్‌ మహిళా క్రికెటర్లు.. మిథాలీ సేన ఓటమి పాలు కావడంతో ఎగిరి గంతేశారు.

సౌతాఫ్రికాతో జరగాల్సిన మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దు కావడంతో విండీస్‌ పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టాప్‌-4 అంటే సెమీస్‌ చేరే క్రమంలో ఇంగ్లండ్‌ బంగ్లాదేశ్‌తో, భారత్‌ దక్షిణాఫ్రికాతో తలపడ్డాయి. ఆదివారం నాటి ఈ రెండు మ్యాచ్‌లలో ఇంగ్లండ్‌ విజయం సాధించి సెమీస్‌ చేరగా.. భారత్‌ ఓడిపోయి ఇంటిబాట పట్టింది.

ఫలితంగా ఇంగ్లండ్‌తో పాటు వెస్టిండీస్‌ సెమీ ఫైనల్‌లో నిలిచింది. ఇదే వారి ఆనందానికి కారణమైంది. ఈ క్రమంలో వారి సంబరాలు అంబరాన్నంటాయి. హమ్మయ్య భారత్‌ ఓడిపోయిందన్నట్లుగా వారు సంతోషంలో మునిగిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. 

చదవండి: World Cup 2022: అంతా నువ్వే చేశావు హర్మన్‌.. కానీ ఎందుకిలా? మా హృదయం ముక్కలైంది!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top