అర్ష్దీప్- శ్రేయస్ (PC: BCCI/IPL)
అర్ష్దీప్ సింగ్ వ్యాఖ్యలు
గతేడాది ఐపీఎల్లో సత్తా చాటిన టీమిండియా స్టార్ బౌలర్ అర్ష్దీప్ సింగ్.. ఈసారి మాత్రం తీవ్రంగా నిరాశపరిచాడు. పంజాబ్ కింగ్స్ తరఫున 2025లో 17 మ్యాచ్లలో కలిపి ఈ లెఫ్టార్మ్ పేసర్ 21 వికెట్లు కూల్చాడు.
అయితే, ఐపీఎల్-2026లో మాత్రం పద్నాలుగు మ్యాచ్లు ఆడి కేవలం 14 వికెట్లు మాత్రమే తీశాడు అర్ష్దీప్ సింగ్. దీంతో ఆటగాడిగా విమర్శలు మూటగట్టుకున్న అర్ష్.. వ్యక్తిగత ప్రవర్తనతోనూ వార్తల్లో నిలిచాడు.
తిలక్ వర్మపై వివక్షపూరిత కామెంట్
ముంబై ఇండియన్స్తో మ్యాచ్కు ముందు ఆ జట్టు ఆటగాడు తిలక్ వర్మను ‘అంధేరీ (నల్లోడా అన్న అర్థంలో)’ అని పిలిచి విమర్శలపాలయ్యాడు అర్ష్దీప్ సింగ్. ఆ తర్వాత యజువేంద్ర చహల్ విమానంలో వేపింగ్ (ఇ- సిగరెట్ తాగడం) చేస్తున్నట్లుగా ఉన్న వీడియో పంచుకుని వివాదానికి కారణమయ్యాడు.
మొత్తానికి ఈ సీజన్లో అర్ష్దీప్ సింగ్ ఏ రకంగానూ అభిమానులను ఆకట్టుకోలేకపోయాడు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సైతం అతడి పట్ల గుర్రుగా ఉన్నాడని, అతడిని తిట్టాడని వార్తలు వచ్చాయి. ఈ విషయాన్ని అర్ష్దీప్ సింగ్ తాజాగా ధ్రువీకరించాడు. పంజాబ్ కింగ్స్ తరఫున హర్లీన్ డియోల్ నిర్వహించే పాడ్కాస్ట్లో మాట్లాడుతూ..
అర్ష్.. అక్కడేం చేస్తున్నావు?
‘‘ఓరోజు మ్యాచ్లో నేను బౌండరీలైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తూ ప్రేక్షకులకు వినోదం పంచాలని సరదాగా చిందులు వేస్తున్నాను. అంతలోనే శ్రేయస్ అయ్యర్ నన్ను గట్టిగా పిలిచాడు. ‘అర్ష్.. అక్కడేం చేస్తున్నావు?’ అని కాస్త కోపంగానే అడిగాడు.
కావాలనే పదకొండో ఓవర్లో బౌలింగ్
వెంటనే నన్ను బౌలింగ్ చేసేందుకు రమ్మన్నాడు. సాధారణంగా నేను తొలి రెండు ఓవర్లు.. అదే విధంగా 17, 20వ ఓవర్లో మాత్రమే బౌలింగ్కు వస్తాను. కానీ ఆరోజు శ్రేయస్ నన్ను పదకొండో ఓవర్లో బౌలింగ్ చేసేందుకు పిలిచాడు.
ఆ పరిణామంతో నేను షాకయ్యాను. ఆ తర్వాత నన్ను పిలిచి కాస్త గట్టిగానే మాట్లాడాడు. మ్యాచ్లో ఏం జరుగుతుందో చూడమన్నాడు. దృష్టి మరల్చకుండా ఏకాగ్రతతో ఉండాలని చెప్పాడు.
బాగా ఆడితే.. లేదంటే అందరూ చెప్పేవాళ్లే
ఒక ఓవర్ నువ్వు బాగా వేశావంటే అంతా బాగానే ఉంటుంది. లేదంటే.. తిట్లు తప్పవు. ప్రతి ఒక్కరు అప్పుడు మన ‘ఫోకస్’ గురించే మాట్లాడతారు’’ అని అర్ష్దీప్ సింగ్ చెప్పుకొచ్చాడు.
కాగా గతేడాది శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో ఫైనల్ చేరిన పంజాబ్ కింగ్స్.. ఈసారి కూడా ఆరంభంలో అదరగొట్టింది. వరుసగా ఆరు మ్యాచ్లు గెలిచి ప్లే ఆఫ్స్ దిశగా దూసుకుపోయింది. అయితే, ఆ తర్వాత వరుసగా ఆరు మ్యాచ్లు ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇదిలా ఉంటే.. శ్రేయస్, అర్ష్ తదుపరి అఫ్గనిస్తాన్తో వన్డే సిరీస్లో కలిసి బరిలో దిగనున్నారు.
చదవండి: ‘అతడు ఉంటే టీమిండియా వరల్డ్కప్ గెలవదు’
🔴 SHREYAS IYER WAS UNHAPPY WITH MY BOUNDARY-LINE ENTERTAINMENT - ARSHDEEP SINGH 🤯
🎙️: While I was fielding on the boundary and entertaining the crowd, Shreyas Iyer suddenly called out, ‘Arsh, what are you doing there?’ and asked me to come bowl. I usually bowl the 1st, 2nd,… pic.twitter.com/iS2bcGE7O9— Sam (@cricsam02) June 6, 2026


