టీ20 క్రికెట్లో అది నేరం లాంటిదే!.. ఏదేమైనా క్రెడిట్‌ మా బౌలర్లకే: హార్దిక్‌ | We Fought Really Well Credit To Our Bowlers But No Balls Cost: Hardik Pandya | Sakshi
Sakshi News home page

టీ20 క్రికెట్లో అది నేరం లాంటిదే!.. ఏదేమైనా క్రెడిట్‌ మా బౌలర్లకే: ఓటమిపై హార్దిక్‌

May 7 2025 10:05 AM | Updated on May 7 2025 10:25 AM

We Fought Really Well Credit To Our Bowlers But No Balls Cost: Hardik Pandya

Photo Courtesy: BCCI

గుజరాత్‌ టైటాన్స్‌ చేతిలో ఓటమిపై ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా (Hardik Pandya) స్పందించాడు. ఆఖరి వరకు తమ జట్టు పోరాడిన తీరు అద్భుతమని కొనియాడాడు. అయితే, నో బాల్స్‌ వేయడం ప్రభావం చూపిందన్న హార్దిక్‌.. టీ20లలో ఇలా చేయడం నేరంతో సమానమని పేర్కొన్నాడు.

ఐపీఎల్‌-2025 (IPL 2025) ప్లే ఆఫ్స్‌ అవకాశాలను మెరుగుపరచుకునే క్రమంలో ముంబై మంగళవారం గుజరాత్‌ టైటాన్స్‌తో తలపడింది.  సొంత మైదానం వాంఖడేలో టాస్‌ ఓడిన ముంబై తొలుత బ్యాటింగ్‌కు దిగింది. గుజరాత్‌ బౌలర్ల ధాటికి నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 155 పరుగులు మాత్రమే చేయగలిగింది.

వాన వల్ల పదే పదే ఆగిన ఆట
ఇక లక్ష్య ఛేదనలో గుజరాత్‌ ఆరంభంలోనే ఓపెనర్‌ సాయి సుదర్శన్‌(5) వికెట్‌ కోల్పోయినా.. మరో ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌ (43) ఇన్నింగ్స్‌ చక్కదిద్దాడు. జోస్‌ బట్లర్‌ (30), షెర్ఫానే రూథర్‌ఫర్డ్‌ (28) అతడికి సహకరించారు.

ఈ క్రమంలో 14 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసి విజయం దిశగా గుజరాత్‌ పయనిస్తున్న వేళ వర్షం వల్ల చాలా సేపు మ్యాచ్‌ నిలిచిపోయింది. అయితే, వాన తెరిపినిచ్చిన తర్వాత ముంబై బౌలర్లు ఒక్కసారిగా విజృంభించారు. జస్‌ప్రీత్‌ బుమ్రా, ట్రెంట్‌ బౌల్ట్‌ ధాటికి పదహారు బంతుల వ్యవధిలో నాలుగు వికెట్లు నష్టపోయింది.

ఈ క్రమంలో మిగిలిన రెండు ఓవర్లలో గుజరాత్‌ విజయానికి 24 పరుగులు అవసరమైన వేళ... భారీ వర్షం వల్ల ఆట మళ్లీ ఆగిపోయింది. ఫలితంగా డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతి ప్రకారం గుజరాత్‌ లక్ష్యం 19 ఓవర్లలో 147గా మారగా.. ఆరు బంతుల్లో 15 పరుగులు చేయాల్సిన పరిస్థితి.

ఆఖరి ఓవర్లో దీపక్‌ చహర్‌ నో బాల్‌
ఈ నేపథ్యంలో తమ పేసర్‌ దీపక్‌ చహర్‌ను ముంబై బరిలోకి దించింది. అయితే, తొలి బంతికే రాహుల్‌ తెవాటియా ఫోర్‌ బాదగా.. మరుసటి బంతికి ఒక రన్‌ వచ్చింది. ఆ తర్వాత గెరాల్డ్‌ కోయెట్జి సిక్సర్‌ బాదాడు. దీంతో మూడు బంతుల్లో విజయ సమీకరణం నాలుగు పరుగులుగా మారింది.

ఇలాంటి కీలక సమయంలో చహర్‌ నోబాల్‌ వేశాడు. అయితే, ఆ తర్వాత అతడు వేసిన లో ఫుల్‌ టాస్‌కు తెవాటియా ఒక్క పరుగే రాబట్టాడు. దీంతో రెండు బంతుల్లో  ఒక్క పరుగు అవసరం కాగా.. చహర్‌ కోయెట్జిని పెవిలియన్‌కు పంపాడు. అయితే, ఆఖరి బంతికి అర్షద్‌ ఖాన్‌ పరుగు తీయడంతో గుజరాత్‌ విజయం ఖరారైంది.

అది నేరం లాంటిదే!.. ఏదేమైనా క్రెడిట్‌ మా బౌలర్లకే
ఈ నేపథ్యంలో మ్యాచ్‌ అనంతరం ముంబై సారథి హార్దిక్‌ పాండ్యా మాట్లాడుతూ.. ‘‘మా వాళ్లు ఆఖరి వరకు పట్టుదలగా పోరాడారు. జట్టుగా మేము సమిష్టిగా ముందుకు సాగాము. అయితే, ఇంకో 25 పరుగులు చేసి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది.

ఏదేమైనా మా బౌలర్లకు క్రెడిట్‌ ఇవ్వాల్సిందే. ఇక క్యాచ్‌ డ్రాప్‌ల వల్ల మూల్యం చెల్లించాల్సి వచ్చిందని నేను అస్సలు అనుకోను. మా వాళ్లు ఈరోజు వందకు 120 శాతం కష్టపడ్డారు.

ఏదేమైనా నో బాల్స్‌ వేయడం సరికాదు. నేను కూడా అదే పని చేశాను. నిజానికి నా దృష్టిలో టీ20 మ్యాచ్‌లో నో బాల్స్‌ వేయడం నేరం లాంటిది. ఇవే మన కొంప ముంచుతాయి. అయితే, మా వాళ్ల ప్రదర్శన పట్ల నేనైతే సంతోషంగానే ఉన్నాను’’ అని చెప్పుకొచ్చాడు.

కాగా గుజరాత్‌ ఇన్నింగ్స్‌ పదకొండో ఓవర్లో హార్దిక్‌ కూడా నో బాల్‌ వేశాడు. ఇక 12వ ఓవర్లో ముంబై శుబ్‌మన్‌ గిల్‌ ఇచ్చిన క్యాచ్‌ను కూడా జారవిడిచింది. కాగా ముంబైపై మూడు వికెట్ల తేడాతో గెలిచిన గుజరాత్‌ 16 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది.

చదవండి: IPL 2025: చరిత్ర సృష్టించిన సూర్య భాయ్‌

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement