ఆఖరి ఓవర్లో నువ్వెందుకు వెళ్లలేదు?.. అన్నీ తెలిసి అతడిని పంపిస్తావా? | MI vs GT: Gavaskar Calls out Hardik For not backing Himself over Chahar | Sakshi
Sakshi News home page

ఆఖరి ఓవర్లో నువ్వెందుకు వెళ్లలేదు?.. అన్నీ తెలిసి అతడిని పంపిస్తావా?

May 7 2025 2:42 PM | Updated on May 7 2025 4:05 PM

MI vs GT: Gavaskar Calls out Hardik For not backing Himself over Chahar

Photo Courtesy: BCCI

ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా (Hardik Pandya) తీరుపై టీమిండియా దిగ్గజం సునిల్‌ గావస్కర్‌ (Sunil Gavaskar) ఆగ్రహం వ్యక్తం చేశాడు. గుజరాత్‌ టైటాన్స్‌ (MI vs GT)తో మ్యాచ్‌లో కీలకమైన ఓవర్లో బౌలర్‌గా బాధ్యతలు తీసుకోకపోవడాన్ని ప్రశ్నించాడు. ఇలాంటి పొరపాట్లు ప్లే ఆఫ్స్‌ అవకాశాలపై ప్రభావం చూపుతాయని.. ఒక్కోసారి ఇలాంటి వాటి వల్లే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని పేర్కొన్నాడు.

ఐపీఎల్‌-2025లో భాగంగా వాంఖడే వేదికగా ముంబై మంగళవారం గుజరాత్‌ టైటాన్స్‌తో తలపడింది. సొంతమైదానంలో టాస్ ఓడిన హార్దిక్‌ సేన తొలుత బ్యాటింగ్‌ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 155 పరుగుల మేర నామమాత్రపు స్కోరు చేసింది.

అయితే, లక్ష్య ఛేదనలో గుజరాత్‌ టైటాన్స్‌కు వర్షం పదే పదే అంతరాయం కలిగించింది. పద్నాలుగు ఓవర్లు ముగిసిన తర్వాత.. మరోసారి వాన పడింది. ఈ క్రమంలో అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా పరిస్థితి అలాగే ఉండగా.. డక్‌వర్త్‌ లూయీస్‌ పద్ధతి ప్రకారం 19 ఓవర్లలో టైటాన్స్‌ లక్ష్యాన్ని 147 పరుగులుగా నిర్దేశించారు.

స్లో ఓవర్‌ రేటు కారణంగా
ఈ దశలో ఆఖరి ఓవర్లో టైటాన్స్‌ విజయానికి పదిహేను పరుగులు అవసరమయ్యాయి. అయితే, అప్పటికే స్లో ఓవర్‌ రేటు కారణంగా ఇన్నింగ్‌ రింగ్‌ బయట ముంబై కేవలం నలుగురు ఫీల్డర్లను ఉంచాల్సిన పరిస్థితి.

ఇలాంటి సమయంలో హార్దిక్‌ పాండ్యా తనే బంతితో రంగంలోకి దిగకుండా.. మరో పేసర్‌ దీపక్‌ చహర్‌ చేతికి బంతినిచ్చాడు. చహర్‌ బౌలింగ్‌ను ఫోర్‌తో మొదలుపెట్టిన టైటాన్స్‌.. ఆ ఓవర్లో కీలక సిక్సర్‌ బాదింది. ఇక చహర్‌ ఒత్తిడిలో ఓ నో బాల్‌ కూడా వేశాడు. ఆ తర్వాత వికెట్‌ తీసినా ఫలితం లేకుండా పోయింది.

గుజరాత్‌ జయభేరి
మొత్తానికి ఆఖరి ఓవర్లో టైటాన్స్‌ 15 పరుగులు సాధించి జయభేరి మోగించింది. పాయింట్ల పట్టికలో గుజరాత్‌ అగ్రస్థానానికి చేరగా.. ముంబై నాలుగో స్థానానికి దిగజారింది. ఈ నేపథ్యంలో సునిల్‌ గావస్కర్‌ స్పందిస్తూ.. ఆఖరి ఓవర్‌ హార్దిక్‌ పాండ్యా వేయాల్సిందని అభిప్రాయపడ్డాడు.

ఆఖరి ఓవర్లో నువ్వెందుకు వెళ్లలేదు?
ఈ మేరకు జియోస్టార్‌లో మాట్లాడుతూ.. ‘‘హార్దిక్‌ ఇప్పటికి చాలా సార్లు కీలక సమయాల్లో ఆఖరి ఓవర్లో బంతితో బరిలో దిగాడు. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో ఫైనల్‌ ఓవర్లో మూడు వికెట్లు తీశాడు. అప్పుడు భారత్‌ గెలిచింది.

ఆ తర్వాత ఇటీవలే టీ20 ప్రపంచకప్‌ 2024 ఫైనల్లోనూ అతడు సౌతాఫ్రికాతో ఫైనల్లో చివరి ఓవర్‌ వేసి ఇండియాను గెలిపించాడు. కాబట్టి ఈసారి కూడా అతడే రంగంలోకి దిగి ఉంటే బాగుండేది.

అన్నీ తెలిసి అతడిని పంపిస్తావా?
దీపక్‌ చహర్‌ ఎక్కువగా ఆఖరి ఐదు ఓవర్లు వేయలేదని కామెంట్రీలో విన్నాను. అరుదుగా మాత్రమే డెత్‌ ఓవర్లలో వస్తాడు. ఇదంతా తెలిసి కూడా ఇలా ఎందుకు చేశారు? స్లో ఓవర్‌రేటు వల్ల ఫీల్డర్ల విషయంలోనూ మీకు స్వేచ్ఛ లేకుండా పోయింది. 

ఇలాంటివి ప్లే ఆఫ్స్‌ అవకాశాలను గల్లంతు చేస్తాయి.. ఇప్పటికైనా కూర్చుని మాట్లాడుకుని పొరపాట్లను సమీక్షించుకోండి’’ అని సునిల్‌ గావస్కర్‌ ముంబై ఇండియన్స్‌కు సూచించాడు.

చదవండి: టీ20 క్రికెట్లో అది నేరం లాంటిదే!.. ఏదేమైనా క్రెడిట్‌ మా బౌలర్లకే: ఓటమిపై హార్దిక్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement