T20 WC: Sachin Tendulkar Request To Indian Fans Not To Judge Team On England Loss - Sakshi
Sakshi News home page

Sachin Tendulkar: 'ఒక్క మ్యాచ్‌కే తీసిపారేయొద్దు.. నెంబర్‌-1 ర్యాంక్‌ రాత్రికి రాత్రే రాలేదు'

Nov 12 2022 6:50 PM | Updated on Nov 12 2022 8:48 PM

We Cannot Judge Team India Only-By-This Performance No-1 T20 Rankings - Sakshi

టి20 ప్రపంచకప్‌లో టీమిండియా సెమీస్‌లో ఓడిపోవడం అభిమానులను చాలా బాధించింది. ఇంగ్లండ్‌తో సెమీస్‌లో 10 వికెట్ల తేడాతో దారుణ పరాజయం చవిచూసిన టీమిండియా అవమానకర రీతిలో టోర్నీ నుంచి నిష్క్రమించింది. అందుకే మ్యాచ్‌ జరిగి రెండు రోజులు పూర్తవుతున్నా అభిమానులు మాత్రం దాని నుంచి బయటకు రాలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ టీమిండియా సెమీస్‌ ఓటమిపై ఏఎన్‌ఐకు ఇచ్చిన ఇంటర్వ్యూలో  స్పందించాడు. 

'' ఇంగ్లండ్‌తో సెమీఫైనల్లో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా భారీ స్కోరును నమోదు చేయలేకపోయింది. తొలుత భారీ స్కోరు చేయకపోవడం టీమిండియాను దెబ్బకొడితే.. ఆపై బౌలర్లు పూర్తిగా విఫలమవ్వడం జట్టు కొంపముంచింది. ఒక్క మ్యాచ్‌కే టీమిండియాను విమర్శించడం కరెక్ట్‌ కాదు. ఇప్పుడు కూడా టి20ల్లో టీమిండియా బాగానే రాణిస్తుందని.. ఐసీసీ టి20 ర్యాంకింగ్స్‌లోనూ అగ్రస్థానంలో ఉందన్న విషయం మరిచిపోవద్దు.

నెంబర్‌వన్‌ స్థానానికి చేరుకోవడం రాత్రికి రాత్రే సాధ్యమయ్యే పని కాదు. అలాంటిది టి20 ప్రపంచకప్‌లో ఒక సెమీఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా ఇచ్చిన ప్రదర్శనను చూసి తప్పుబట్టకూడదు. ఆటలో ఎత్తుపల్లాలు ఉండడం సహజమే. అయితే ఒక మేజర్‌ టోర్నీలో టీమిండియా ఇలాంటి ప్రదర్శన ఇచ్చిందన్న బాధ అభిమానులకు ఉంటుంది.'' అని పేర్కొన్నాడు.

ఇక టి20 ప్రపంచకప్‌లో ఆదివారం(నవంబర్‌ 13న) ఇంగ్లండ్‌, పాకిస్తాన్‌ల మధ్య ప్రతిష్టాత్మక ఫైనల్‌ జరగనుంది. మెల్‌బోర్న్‌ క్రికెట్‌ స్టేడియం ఈ మ్యాచ్‌కు ఆతిథ్యమివ్వనుంది. మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉంది. రిజర్వ్‌ డే రోజున వర్షం వల్ల ఫలితం రాకపోతే ఇరుజట్లను సంయుక్త విజేతలుగా ప్రకటించనున్నారు.

చదవండి: T20 WC: ప్రతిష్టాత్మక ఫైనల్‌ ​కోసం రూల్స్‌ సవరింపు!

T20 WC: టీమిండియాకు వచ్చిన ప్రైజ్‌మనీ ఎంతంటే?

Advertisement
 
Advertisement
Advertisement