రాజస్తాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ.. టీమిండియాలోకి ఎంట్రీ ఇవ్వడానికి సర్వం సిద్ధమైంది. ఐర్లాండ్, ఇంగ్లండ్తో జరిగే టీ20 సిరీస్లకు వైభవ్ను బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే భారత సీనియర్ క్రికెట్ జట్టుకు ఎంపికైన అత్యంత పిన్న వయస్కుడిగా భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డును వైభవ్ బ్రేక్ చేయనున్నాడు.
సచిన్ 16 ఏళ్ల 205 రోజుల వయసులో పాక్పై తన అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. ఇప్పుడు వైభవ్ వయస్సు కేవలం 15 ఏళ్ల 70 రోజులు మాత్రమే. దీంతో మరో నెల రోజుల్లో సచిన్ ఆల్టైమ్ రికార్డు బద్దలు అవ్వడం ఖాయమన్పిస్తోంది. కాగా ఐర్లాండ్, ఇంగ్లండ్ సిరీస్లకు భారత జట్టును అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ శనివారం ప్రకటించనుంది. ఈ సందర్భంగా సెలక్టర్లు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
గత కొంత కాలంగా పేలవ ఫామ్తో సతమవుతున్న టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్పై వేటు వేయనున్నట్లు తెలుస్తోంది. అతడి స్ధానంలో మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ను టీ20 జట్టు సారధిగా నియమించనున్నట్లు సమాచారం. అదేవిధంగా వైభవ్ సూర్యవంశీ ఎంపికను కూడా సెలక్టర్లు అధికారికంగా ప్రకటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
వైభవ్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. ఐపీఎల్-2026లో 776 పరుగులు పరుగులతో టాప్ రన్స్కోరర్గా వైభవ్ నిలిచాడు. మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్, ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్,సూపర్ సిక్సెస్ ఆఫ్ ది సీజన్ అవార్డులు కూడా సూర్యవంశీనే సొంతం చేసుకున్నాడు. అతడు ఐర్లాండ్ టూర్ కంటే ముందు శ్రీలంకలో ఇండియా-ఎ తరపున ఆడనున్నాడు.
చదవండి: IND vs AFG: పంత్కు గంభీర్ క్లాస్.. లీక్ చేసిన అసిస్టెంట్ కోచ్!


