అఫ్గానిస్తాన్తో ఏకైక టెస్ట్ మ్యాచ్కు ముందు టీమిండియా వైస్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి రిషబ్ పంత్ను తప్పించిన సంగతి తెలిసిందే. అతడి స్ధానంలో సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ను టెస్ట్ జట్టు వైస్ కెప్టెన్గా బీసీసీఐ నియమించింది. గతేడాది రోహిత్ శర్మ నుంచి భారత టెస్ట్ జట్టు పగ్గాలను చేపట్టిన గిల్కు డిప్యూటీగా పంత్ ఎంపికయ్యాడు.
కానీ ఆ తర్వాత అతడి ఫామ్ దారుణంగా పడిపోయింది. ఇంగ్లండ్, దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్లలో రిషబ్ పేలవమైన ప్రదర్శనలు కనబరిచాడు. దీంతో అతడిని వైస్ కెప్టెన్సీ నుంచి తప్పించారు. ఈ నేపథ్యంలో పంత్తో హెడ్కోచ్ గౌతమ్ గంభీర్ సుదీర్ఘ చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.
అఫ్గాన్తో జరిగే టెస్టు మ్యాచ్లో ఒక సీనియర్ ఆటగాడిగా ఎలా వ్యవహరించాలనే విషయంపై గంభీర్ పంత్తో మాట్లాడాడు. ఈ విషయాన్ని ప్రీ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్లో భారత అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డెష్కాట్ వెల్లడించాడు.
"రిషబ్ ఒక సీనియర్ ప్లేయర్గా జట్టులో బాధ్యతాయుతమైన పాత్ర పోషించేందుకు సిద్దంగా ఉన్నాడు. యువ ఆటగాళ్లతో కమ్యూనికేషన్ ఎలా ఉండాలి, పరిస్థితులకు తగ్గట్టుగా ఆటను ఎలా మార్చుకోవాలి అనే విషయాలపై గంభీర్, పంత్ మధ్య చర్చ జరిగింది. జట్టులో ఒక రోల్ మోడల్గా పంత్ నిలుస్తాడని ఆశిస్తున్నాను" అని డెష్కాట్ పేర్కొన్నాడు. కాగా 2025లో రిషబ్ మొత్తం 7 టెస్టులు ఆడి, 48.38 సగటుతో 629 పరుగులు చేశాడు.
ఇందులో 2 సెంచరీలు, 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఓవరాల్గా రికార్డు బాగున్నప్పటికీ, సౌతాఫ్రికాతో జరిగిన సిరీస్లోని నాలుగు ఇన్నింగ్స్ల్లో అతను కేవలం 27, 2, 7, 13 పరుగులు మాత్రమే చేసి తీవ్రంగా నిరాశపరిచాడు. ఐపీఎల్-2026లో కూడా అదే తీరును కనబరిచాడు. ఐపీఎల్లో 12 మ్యాచ్లు ఆడి కేవలం 27.88 సగటుతో 251 పరుగులు మాత్రమే చేశాడు. అనంతరం లక్నో కెప్టెన్సీ నుంచి కూడా తప్పుకొన్నాడు.
చదవండి: AUS vs PAK: షాహీన్ దెబ్బ.. ఆసీస్ అబ్బా! వన్డే సిరీస్ పాక్దే


