లహోర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్ డిసైడర్ మూడో వన్డేలో 4 వికెట్ల తేడాతో పాకిస్తాన్ ఘన విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్ను 2-1తో పాక్ కైవసం చేసుకుంది. ఈ ఆఖరి మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 42 ఓవర్లలో కేవలం 157 పరుగులకే ఆలౌటైంది.
షాహీన్ అఫ్రిది మూడు వికెట్లు పడగొట్టి ఆసీస్ పతనాన్ని శాసించగా.. షాదాబ్ ఖాన్, అబ్రార్ అహ్మద్ తలా రెండు వికెట్లు సాధించారు. ఆసీస్ ఇన్నింగ్స్లో కెప్టెన్ జోష్ ఇంగ్లిస్ (65 పరుగులు, 71 బంతుల్లో, 8 ఫోర్లు, 1 సిక్స్) ఒంటరి పోరాటం చేయగా, మిగిలిన బ్యాటర్లు చేతులెత్తేశారు. పాక్ గడ్డపై ఆసీస్కు ఇదే అత్యల్ప వన్డే స్కోర్ కావడం గమనార్హం.
రాణించిన బాబర్ ఆజం
అనంతరం 158 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్కు ఆసీస్ స్పిన్నర్లు చుక్కలు చూపించారు. ఆతిథ్య జట్టు 60 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. పిచ్ స్పిన్కు అనుకూలించడంతో పాక్ బ్యాటర్లు పరుగులు తీయడానికి ఇబ్బంది పడ్డారు.
ఈ సమయంలో మాజీ కెప్టెన్ బాబర్ ఆజం (40 పరుగులు, 84 బంతుల్లో) ఆచితూచి ఆడి ఇన్నింగ్స్ను చక్కదిద్దగా.. షాదాబ్ ఖాన్(42 బంతుల్లో 29), సమద్(30) అజేయంగా నిలిచి మ్యాచ్ను ఫినిష్ చేశారు. ఆసీస్ బౌలర్లలో మాథ్యూ కుహ్నెమాన్ 3 వికెట్లు పడగొట్టగా.. రెన్షా, ఎల్లీస్ తలా వికెట్ సాధించారు.
చదవండి: ENG vs NZ: తొలి రోజే 16 వికెట్లు.. పీకల్లోతు కష్టాల్లో న్యూజిలాండ్


