టీమిండియా టీ20 వైస్ కెప్టెన్, హైదరాబాదీ క్రికెటర్ తిలక్ వర్మను తిరిగి వన్డే సెటప్లోకి తీసుకురావాలని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు సమాచారం. 2027 వన్డే వరల్డ్ కప్ను దృష్టిలో ఉంచుకుని, శ్రేయస్ అయ్యర్కు బ్యాకప్గా తిలక్ను సిద్ధం చేయాలని హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మెగా టోర్నీ సన్నాహకాల్లో భాగంగా న్యూజిలాండ్, వెస్టిండీస్లతో జరగనున్న వన్డే సిరీస్లకు తిలక్ను ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయి.
పరిమిత ఓవర్ల క్రికెట్లో తిలక్ వర్మకు అద్భుతమైన రికార్డు ఉంది. ముఖ్యంగా టీ20ల్లో నిలకడగా రాణిస్తూ జట్టులో కీలక సభ్యుడిగా మారాడీ ఈ హైదరాబాదీ. అతడికి ఇటీవల బీసీసీఐ భారత టీ20 జట్టు వైస్ కెప్టెన్సీ బాధ్యతలను కూడా అప్పగించింది. అయితే ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ వన్డేల్లో మాత్రం తన మార్క్ ఇంకా చూపించాల్సి ఉంది.
ఇప్పటివరకు 5 వన్డేలు ఆడిన తిలక్ 68 పరుగులు చేశాడు. గతేడాది డిసెంబర్లో అతడు భారత్ తరఫున చివరి వన్డే మ్యాచ్ ఆడాడు. ఈ క్రమంలో టీ20ల్లో అదరగొడుతున్న తిలక్కు వన్డేల్లోనూ రాణించేందుకు మేనేజ్మెంట్ మరో అవకాశం ఇవ్వాలని భావిస్తోంది. అలాగే అతడి పార్ట్-టైమ్ స్పిన్ బౌలింగ్ స్కిల్స్ కూడా జట్టుకు అదనపు బలంగా మారతాయని భావిస్తున్నారు.
"భారత వన్డే జట్టు మిడిల్ ఆర్డర్లో సరైన బ్యాకప్ ప్లేయర్లు లేరు. ఇదే విషయంపై హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ శుబ్మన్ గిల్ల మధ్య చర్చ నడుస్తోంది. స్టార్ ఆల్రౌండర్లు హార్దిక్ పాండ్యా, నితీష్ కుమార్ రెడ్డిల ఫిట్నెస్పై పూర్తి స్పష్టత లేకపోవడంతో ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టారు.
టాప్-మిడిల్ ఆర్డర్లో ఉంటూ కనీసం 4 ఓవర్లు వేయగల ఆటగాడు జట్టుకు అవసరమని గంభీర్ అండ్కో భావిస్తున్నారు. వన్డే వరల్డ్ కప్ జరిగే దక్షిణాఫ్రికా మైదానాల్లో బ్యాటింగ్ చేయడం సులువు కాదు. ఆస్ట్రేలియా పర్యటన మధ్యలో శ్రేయస్ అయ్యర్ గాయపడటం, ఇటీవల కొందరు ఆటగాళ్లు పదే పదే గాయాల బారిన పడుతుండటంతో మేనెజ్మెంట్ ముందుజాగ్రత్త చర్యలు చేపట్టింది.
ప్రస్తుతం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి వంటి సీనియర్లు ఉన్నారు. వారు కూడా ప్రస్తుతం చిన్న చిన్న ఫిట్నెస్ సమస్యలతో సతమవుతున్నారు. మరోవైపు కేఎల్ రాహుల్ వయసు 35 ఏళ్లు దాటుతుంది. రవీంద్ర జడేజా కూడా వన్డే ప్రపంచకప్ జట్టులో ఉంటాడా లేదా అనే దానిపై ఇంకా క్లారిటీ లేదు.
అందుకే సౌతాఫ్రికా కండిషన్లకు తగ్గట్లు తిలక్ వర్మ లాంటి యువ ఆటగాళ్లను సిద్దం చేయాలని ప్లాన్ చేస్తున్నారు" అని బీసీసీఐ అధికారి ఒకరు 'టైమ్స్ ఆఫ్ ఇండియా'కు వెల్లడించారు. ఒకవేళ శ్రేయస్ అయ్యర్ విఫలమైతే తుది జట్టులో అతడి స్దానాన్ని తిలక్ భర్తీ చేసే అవకాశముంది.
చదవండి: భారత క్రికెటర్లకు ఫిట్నెస్ పరీక్షలు


