
లైవ్ రేటింగ్స్లో భారత నంబర్వన్గా తమిళనాడు గ్రాండ్మాస్టర్
తాష్కెంట్: అందివచ్చిచన అవకాశాలను సద్వినియోగం చేసుకున్న భారత యువ గ్రాండ్మాస్టర్, తమిళనాడు కుర్రాడు ప్రజ్ఞానంద... ఉజ్చెస్ కప్ మాస్టర్స్ అంతర్జాతీయ టోర్నీలో చాంపియన్గా నిలిచాడు. పది మంది మేటి గ్రాండ్మాస్టర్ల మధ్య తొమ్మిది రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీ శుక్రవారం ముగిసింది. నిర్ణీత తొమ్మిది రౌండ్ల తర్వాత ప్రజ్ఞానందతోపాటు నొదిర్బెక్ అబ్దుసత్తోరోవ్ (ఉజ్బెకిస్తాన్), జవోఖిర్ సిందరోవ్ (ఉజ్బెకిస్తాన్) 5.5 పాయింట్లతో ఉమ్మడిగా అగ్రస్థానంలో నిలిచారు. దాంతో విజేతను నిర్ణయించేందుకు ఈ ముగ్గురి మధ్య టైబ్రేక్ గేమ్లను నిర్వహించారు.
తొలి రౌండ్ టైబ్రేక్ గేమ్ల తర్వాత ముగ్గురూ 2 పాయింట్లతో సమంగా నిలిచారు. దాంతో ఈ ముగ్గురి మధ్య రెండో రౌండ్ టైబ్రేక్ గేమ్లు నిర్వహించారు. ఈసారి ప్రజ్ఞానంద 1.5 పాయింట్లతో టైటిల్ను ఖరారు చేసుకున్నాడు. 1 పాయింట్తో సిందరోవ్ రన్నరప్గా నిలిచాడు. అర పాయింట్తో నొదిర్బెక్ మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు. గురువారం ఎనిమిదో రౌండ్ ముగిశాక నొదిర్బెక్ 5.5 పాయింట్లతో అగ్రస్థానంలో, సిందరోవ్ 5 పాయింట్లతో రెండో స్థానంలో, ప్రజ్ఞానంద 4.5 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నారు.
శుక్రవారం జరిగిన చివరిదైన తొమ్మిదో రౌండ్లో ప్రజ్ఞానంద 49 ఎత్తుల్లో నొదిర్బెక్ను ఓడించగా... పర్హామ్ మగ్సూద్ (ఇరాన్)తో జరిగిన గేమ్ను సిందరోవ్ ‘డ్రా’ చేసుకున్నాడు. దాంతో ఈ ముగ్గురూ 5.5 పాయింట్లతో ఉమ్మడిగా టాప్ ర్యాంక్లో నిలిచారు. తెలంగాణకు చెందిన భారత గ్రాండ్మాస్టర్ ఇరిగేశి అర్జున్ ఐదు పాయింట్లతో నాలుగో స్థానంతో ఈ టోర్నీని ముగించాడు. విజేతగా నిలిచిన ప్రజ్ఞానందకు 20 వేల డాలర్లు (రూ. 17 లక్షలు) ప్రైజ్మనీగా లభించాయి.
తాజా విజయంతో 19 ఏళ్ల ప్రజ్ఞానంద లైవ్ రేటింగ్స్లో 2778.3 పాయింట్లతో భారత నంబర్వన్ చెస్ ప్లేయర్గా అవతరించాడు. ప్రపంచ ర్యాంకింగ్స్లో ఈ తమిళనాడు గ్రాండ్మాస్టర్ నాలుగో స్థానానికి ఎగబాకాడు. 2776.6 పాయింట్లతో దొమ్మరాజు గుకేశ్ ఐదో స్థానంలో, 2775.7 పాయింట్లతో అర్జున్ ఆరో స్థానంలో ఉన్నారు.