పది రోజులు తిరక్కుండానే మరో జట్టును ఫైనల్‌కు చేర్చిన శ్రేయస్‌ అయ్యర్‌ | T20 Mumbai 2025: Shreyas Iyer Led SoBo Mumbai Falcons Enters Into Finals, Check Out Score Details And Highlights Inside | Sakshi
Sakshi News home page

పది రోజులు తిరక్కుండానే మరో జట్టును ఫైనల్‌కు చేర్చిన శ్రేయస్‌ అయ్యర్‌

Jun 11 2025 11:25 AM | Updated on Jun 11 2025 12:48 PM

T20 Mumbai 2025: Shreyas Iyer Led SoBo Mumbai Falcons Enters Into Finals

టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌కు తాను కెప్టెన్సీ వహించే జట్లను అలవోకగా ఫైనల్‌కు చేర్చడం అలవాటుగా మారింది. జూన్‌ 1న ఐపీఎల్‌ 2025లో పంజాబ్‌ కింగ్స్‌ను ఫైనల్స్‌కు చేర్చిన శ్రేయస్‌.. పది రోజులు కూడా తిరక్కుండానే మరో జట్టును ఫైనల్‌కు చేర్చాడు. 

ముంబై టీ20 లీగ్‌ 2025లో నిన్న (జూన్‌ 10) జరిగిన రెండో సెమీఫైనల్లో శ్రేయస్‌ సారథ్యం వహించిన సోబో ముంబై ఫాల్కన్స్‌ నమో బాంద్రా బ్లాస్టర్స్‌ను మట్టికరిపించి ఫైనల్‌కు చేరింది.

ఏడాది కాలంలో శ్రేయస్‌ తాను సారథ్యం వహించిన జట్లను ఫైనల్స్‌కు చేర్చడం ఇది నాలుగో సారి. 2024 ఐపీఎల్‌తో మొదలైన శ్రేయస్‌ కెప్టెన్సీ జైత్రయాత్ర ప్రస్తుతం జరుగుతున్న ముంబై టీ20 లీగ్‌ వరకు కొనసాగింది. 

2024 ఐపీఎల్‌లో కేకేఆర్‌ను ఛాంపియన్‌గా నిలిపిన శ్రేయస్‌.. ఆతర్వాత ముంబైకు సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీని అందించాడు. తాజాగా ముగిసిన ఐపీఎల్‌ సీజన్‌లో పంజాబ్‌ను ఫైనల్స్‌కు చేర్చిన శ్రేయస్‌ తృటిలో టైటిల్‌ మిస్‌ కావడంతో రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. ఈ ఐపీఎల్‌ సీజన్‌లోనే పంజాబ్‌ కింగ్స్‌ సారథ్య బాధ్యతలు చేపట్టిన శ్రేయస్‌ ఆ జట్టును 11 ఏళ్ల తర్వాత ఫైనల్‌కు చేర్చాడు.

శ్రేయస్‌ తన జట్లను ఫైనల్స్‌కు చేర్చిన గత నాలుగు సందర్భాల్లో వ్యక్తిగతంగానూ రాణించాడు. ఐపీఎల్‌ 2024లో కేకేఆర్‌ను ఛాంపియన్‌గా నిలిపిన సందర్భంలో 15 మ్యాచ్‌ల్లో 39 సగటున, 146.86 స్ట్రయిక్‌రేట్‌తో 2 హాఫ్‌ సెంచరీల సాయంతో 351 పరుగులు చేశాడు.

అనంతరం ముంబైకు ముస్తాక్‌ అలీ ట్రోఫీ అందించిన సందర్భంలో 188.52 స్ట్రయిక్‌రేట్‌తో 345 పరుగులు సాధించాడు. తాజాగా ముగిసిన ఐపీఎల్‌ 2025 సీజన్‌లో 175.07 స్ట్రయిక్‌రేట్‌తో 604 పరుగులు సాధించాడు. ముంబై టీ20 లీగ్‌లోకి ఆలస్యంగా అడుగుపెట్టిన శ్రేయస్‌ ఈ లీగ్‌లో ఫామ్‌ను ప్రదర్శించాల్సి ఉంది.

చరిత్ర సృష్టించాడు
తాజాగా ముగిసిన ఐపీఎల్‌లో పంజాబ్‌ కింగ్స్‌ను ఫైనల్స్‌కు చేర్చడం ద్వారా శ్రేయస్‌ అయ్యర్‌ చరిత్ర సృష్టించాడు. 18 ఏళ్ల ఐపీఎల్‌ చరిత్రలో మూడు వేర్వేరు జట్లను ఫైనల్స్‌కు చేర్చిన తొలి కెప్టెన్‌గా రికార్డు నెలకొల్పాడు. శ్రేయస్‌ తన సారథ్యంలో 2019లో ఢిల్లీని, 2024లో కేకేఆర్‌ను, 2025లో పంజాబ్‌ను ఫైనల్స్‌కు చేర్చాడు.

ముంబై టీ20 లీగ్‌ సెమీఫైనల్‌ విషయానికొస్తే.. నిన్న జరిగిన మ్యాచ్‌లో శ్రేయస్‌ సారథ్యంలోని సోబో ముంబై ఫాల్కన్స్‌ నమో బాంద్రా బ్లాస్టర్స్‌పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన బ్లాస్టర్స్‌ 130 పరుగులకు ఆలౌట్‌ కాగా.. శ్రేయస్‌ జట్టు 14.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. 

ఈ మ్యాచ్‌లో శ్రేయస్‌ వ్యక్తిగతంగా రాణించనప్పటికీ (1) తన జట్టును విజయవంతంగా ఫైనల్స్‌కు చేర్చాడు. రేపు జరుగబోయే ఫైనల్స్‌లో శ్రేయస్‌ జట్టు సిద్దేశ్‌ లాడ్‌ నేతృత్వంలోని ముంబై సౌత్‌ సెంట్రల్‌ మరాఠా రాయల్స్‌తో అమీతుమీ తేల్చుకుంటుంది. శ్రేయస్‌ ఈ టైటిల్‌ను కూడా సాధిస్తే కెప్టెన్‌గా అతనికి తిరుగే ఉండదు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement