
అభిషేక్ శర్మ సెంచరీ మోత
55 బంతుల్లో 14 ఫోర్లు, 10 సిక్సర్లతో 141
సన్రైజర్స్ సూపర్ విజయం
8 వికెట్లతో పంజాబ్ కింగ్స్ చిత్తు
తొలి ఐదు మ్యాచ్లలో కలిపి 51 పరుగులు...ఈ సీజన్లో అభిషేక్ శర్మ ప్రదర్శన ఇది. వరుస వైఫల్యాలతో విమర్శలు ఎదుర్కొంటున్న అతను తన గత ఏడాది ఆటను ఒక్కసారిగా గుర్తు తెచ్చుకున్న ట్లున్నాడు. పంజాబ్పై మ్యాచ్లో ఒక్కసారిగా తన కసినంతా ప్రదర్శిస్తూ వీర విధ్వంసం సృష్టించాడు. కేవలం బౌండరీలతోనే 116 పరుగులు బాది శతకనాదం చేశాడు. ఇది ఆరెంజ్ ఆర్మీ కోసం అంటూ రాసి ఉన్న కాగితాన్ని ప్రదర్శిస్తూ ఈ ఇన్నింగ్స్ విలువేమిటో చెప్పాడు.
అభిషేక్కు హెడ్ మెరుపులు తోడవడంతో 246 పరుగుల లక్ష్యాన్ని కూడా మరో 9 బంతులు మిగిలి ఉండగానే ఛేదించి సన్రైజర్స్ సంచలనం సృష్టించింది. మరో వైపు సమష్టి ప్రదర్శనతో 245 పరుగులు చేసి కూడా ఓటమిపాలైన పంజాబ్ కింగ్స్ తీవ్ర నిరాశకు లోనైంది. ఓవరాల్గా 492 పరుగులతో అభిమానులకు ఫుల్ జోష్ దక్కింది.
సాక్షి, హైదరాబాద్: ఐపీఎల్ సీజన్ నాలుగు వరుస పరాజయాల తర్వాత నిస్తేజంగా కనిపించిన సన్రైజర్స్ హైదరాబాద్ ఘనమైన రీతిలో కోలుకుంది. తమ అసలు ఆటను ప్రదర్శిస్తూ లీగ్లో తమను తక్కువగా అంచనా వేయవద్దనే సందేశాన్ని ఇచ్చింది. శనివారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ 8 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్పై ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 245 పరుగులు చేసింది.
శ్రేయస్ అయ్యర్ (36 బంతుల్లో 82; 6 ఫోర్లు, 6 సిక్స్లు), ప్రభ్సిమ్రన్ సింగ్ (23 బంతుల్లో 42; 7 ఫోర్లు, 1 సిక్స్), ప్రియాన్‡్ష ఆర్య (13 బంతుల్లో 36; 2 ఫోర్లు, 4 సిక్స్లు) కీలక పరుగులు సాధించారు. అనంతరం సన్రైజర్స్ 18.3 ఓవర్లలో 2 వికెట్లకు 247 పరుగులు సాధించింది. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అభిషేక్ శర్మ (55 బంతుల్లో 141; 14 ఫోర్లు, 10 సిక్స్లు) ఐపీఎల్లో తన తొలి సెంచరీని నమోదు చేయగా, ట్రవిస్ హెడ్ (37 బంతుల్లో 66; 9 ఫోర్లు, 3 సిక్స్లు) రాణించాడు. వీరిద్దరు తొలి వికెట్కు 75 బంతుల్లో 171 పరుగులు జోడించారు.
మెరుపు బ్యాటింగ్...
పవర్ప్లేలో 89 పరుగులు...10 ఓవర్లు ముగిసే సరికి 120. తర్వాతి 5 ఓవర్లలో 57 పరుగులు...ఆఖరి 5 ఓవర్లలో 68 పరుగులు... పంజాబ్ కింగ్స్ ఇలా దాదాపు అన్ని దశల్లోనూ ఒకే తరహాలో దూకుడుగా సాగింది. టాప్–7లో ఇద్దరు మినహా మిగతావారంతా చెలరేగిపోవడంతో భారీ స్కోరు సాధ్యమైంది. షమీ వేసిన తొలి ఓవర్లో ప్రభ్సిమ్రన్ వరుసగా 3 ఫోర్లతో మొదలు పెట్టగా, షమీ తర్వాతి ఓవర్లో ప్రియాన్ష్ వరుసగా 6, 6, 4 బాదాడు. కమిన్స్ తొలి ఓవర్లో కూడా 2 ఫోర్లు, సిక్స్తో పంజాబ్ 16 పరుగులు రాబట్టింది.
అయితే తన తొలి రెండు ఓవర్లలో 28 పరుగులిచ్చిన హర్షల్...ప్రియాన్‡్షను అవుట్ చేయడంలో సఫలమయ్యాడు. ఈ మ్యాచ్తో ఐపీఎల్లో అరంగేట్రం చేసిన మలింగ తన తొలి వికెట్గా ప్రభ్సిమ్రన్ను వెనక్కి పంపించాడు. ఆ తర్వాత శ్రేయస్, నేహల్ వధేరా (22 బంతుల్లో 27; 2 ఫోర్లు, 1 సిక్స్) భాగస్వామ్యం కూడా జోరుగా సాగింది. వీరిద్దరు మూడో వికెట్కు 40 బంతుల్లోనే 73 పరుగులు జోడించారు.
అన్సారీ ఓవర్లో 2 సిక్స్లు, ఫోర్ బాదిన శ్రేయస్ 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీని అందుకున్నాడు. శశాంక్ సింగ్ (2) విఫలం కాగా, మలింగ ఓవర్లో శ్రేయస్ 4 ఫోర్లతో చెలరేగాడు. అయితే రెండు బంతుల వ్యవధిలో మ్యాక్స్వెల్ (3), శ్రేయస్లను హర్షల్ అవుట్ చేయడంతో 18, 19 ఓవర్లలో కలిపి 13 పరుగులే వచ్చాయి.
ఒకే ఓవర్లో 27 పరుగులు...
షమీ వేసిన ఆఖరి ఓవర్లో కింగ్స్ పండగ చేసుకుంది. ఫామ్లో లేక ఇబ్బంది పడుతున్న స్టొయినిస్ ఈ ఓవర్లో చెలరేగిపోయాడు. చివరి 4 బంతుల్లో అతను వరుసగా 6, 6, 6, 6 బాదడంతో మొత్తం 27 పరుగులు లభించాయి.
బౌండరీల వర్షం...
అర్ష్ దీప్ వేసిన తొలి ఓవర్లో హెడ్ 2 ఫోర్లు కొట్టడంతో రైజర్స్ విధ్వంసం మొదలైంది. యాన్సెన్ ఓవర్లో అభిషేక్ నాలుగు ఫోర్లు కొట్టగా, అర్ష్ దీప్ తర్వాతి ఓవర్లో హెడ్ వరుసగా మూడు ఫోర్లు బాదాడు. ఆ తర్వాత యశ్ ఠాకూర్ ఓవర్లో 2 సిక్స్లు, ఫోర్తో చెలరేగిపోయాడు. పవర్ప్లేలో జట్టు 83 పరుగులు సాధించింది. 19 బంతుల్లోనే అభిషేక్ హాఫ్ సెంచరీని చేరుకున్నాడు.

మరో వైపు మ్యాక్స్వెల్ ఓవర్లో రెండు భారీ సిక్స్లు బాదిన హెడ్ 31 బంతుల్లో అర్ధ సెంచరీ సాధించాడు. యాన్సెన్ వేసిన ఓవర్లో మళ్లీ శివమెత్తిన అభిషేక్ 2 సిక్స్లు, 2 ఫోర్లు బాదాడు. చహల్ ఓవర్లో ఎట్టకేలకు హెడ్ వెనుదిరిగిన తర్వాత అదే ఓవర్ చివరి బంతికి సింగిల్ తీసి 40 బంతుల్లో అభిషేక్ సెంచరీ మార్క్ను చేరుకొని గర్జించాడు.
ఆ తర్వాత చెలరేగి బౌండరీల వర్షం కురిపించిన అభిషేక్ జట్టును అలవోకగా విజయం దిశగా నడిపించాడు. సాహసవంతులకే అదృష్టం కలిసి వస్తుందన్నట్లు అభిషేక్కు రెండు లైఫ్లు లభించాయి. 28 వద్ద ఠాకూర్ బౌలింగ్లో క్యాచ్ ఇవ్వగా అది నోబాల్గా తేలింది. ఆ తర్వాత 56 వద్ద చహల్ తన బౌలింగ్లోనే సునాయాస క్యాచ్ను వదిలేశాడు. దీనిని అతను బ్రహ్మండంగా వాడుకున్నాడు.
స్కోరు వివరాలు
పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: ప్రియాన్ష్ (సి) నితీశ్ రెడ్డి (బి) హర్షల్ 36; ప్రభ్సిమ్రన్ (సి) కమిన్స్ (బి) మలింగ 42; శ్రేయస్ (సి) హెడ్ (బి) హర్షల్ 82; వధేరా (ఎల్బీ) (బి) మలింగ 27; శశాంక్ (ఎల్బీ) (బి) హర్షల్ 2; మ్యాక్స్వెల్ (బి) హర్షల్ 3; స్టొయినిస్ (నాటౌట్) 34; యాన్సెన్ (నాటౌట్) 5; ఎక్స్ట్రాలు 14; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 245. వికెట్ల పతనం: 1–66, 2–91, 3–164, 4–168, 5–205, 6–206. బౌలింగ్: మొహమ్మద్ షమీ 4–0–75–0, కమిన్స్ 4–0–40–0, హర్షల్ 4–0–42–4, ఇషాన్ మలింగ 4–0–45–2, అన్సారీ 4–0–41–0.
సన్రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: హెడ్ (సి) మ్యాక్స్వెల్ (బి) చహల్ 66; అభిషేక్ (సి) (సబ్) దూబే (బి) అర్‡్షదీప్ 141; క్లాసెన్ (నాటౌట్) 21; ఇషాన్ కిషన్ (నాటౌట్) 9; ఎక్స్ట్రాలు 10; మొత్తం (18.3 ఓవర్లలో 2 వికెట్లకు) 247. వికెట్ల పతనం: 1–171, 2–222. బౌలింగ్: అర్ష్ దీప్ 4–0–37–1, యాన్సెన్ 2–0–39–0, యశ్ ఠాకూర్ 2.3–0–40–0, మ్యాక్స్వెల్ 3–0–40–0, ఫెర్గూసన్ 0.2–0–1–0, స్టొయినిస్ 0.4–0–6–0, చహల్ 4–0–56–1, శశాంక్ 2–0–27–0.
75 ఐపీఎల్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్ల జాబితాలో షమీ రెండో స్థానంలో నిలిచాడు. అతను 75 పరుగులివ్వగా, ఇదే సీజన్లో రాజస్తాన్ బౌలర్ ఆర్చర్ 76 పరుగులు ఇచ్చాడు.
1 ఐపీఎల్లో భారత బ్యాటర్ సాధించిన అత్యధిక స్కోరు ఇదే. కేఎల్ రాహుల్ (132) పేరిట ఉన్న రికార్డును అభిషేక్ శర్మ సవరించాడు.
ఐపీఎల్లో నేడు
రాజస్తాన్ X బెంగళూరు
వేదిక: జైపూర్
మధ్యాహ్నం 3: 30 గంటల నుంచి
ఢిల్లీ X ముంబై
వేదిక: ఢిల్లీ రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్స్టార్లో ప్రత్యక్ష ప్రసారం