గాయాల బారిన సీనియ‌ర్లు.. టీమిండియాకు షాక్ త‌ప్ప‌దా? | Senior Cricketers Doughtful-For-ODI Series Will-AFG-Shocks Team India | Sakshi
Sakshi News home page

IND Vs AFG: గాయాల బారిన సీనియ‌ర్లు.. టీమిండియాకు షాక్ త‌ప్ప‌దా?

Jun 5 2026 3:55 PM | Updated on Jun 5 2026 4:05 PM

Senior Cricketers Doughtful-For-ODI Series Will-AFG-Shocks Team India

ఐపీఎల్ 2026 సీజ‌న్ ముగియ‌డంతో టీమిండియా ప్ర‌స్తుతం అఫ్గానిస్తాన్‌తో జ‌ర‌గ‌నున్న టెస్టుతో పాటు వ‌న్డే సిరీస్‌పై దృష్టి సారించింది. రేప‌టి నుంచి భార‌త్‌, అఫ్గానిస్తాన్ మ‌ధ్య ముల్ల‌న్‌పూర్ వేదిక‌గా ఏకైక టెస్టు మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ఈ మ్యాచ్‌కు గిల్ నేతృత్వంలోని టీమిండియా స్టేడియానికి చేరుకొని ప్రాక్టీస్ కూడా మొద‌లుపెట్టేసింది. 

టెస్టు సిరీస్ ముగిసిన త‌ర్వాత వెంట‌నే మూడు వ‌న్డే మ్యాచ్‌ల సిరీస్ జ‌ర‌గ‌నుంది. ఈ సిరీస్‌కు సీనియ‌ర్లు రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీ పేర్ల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకొని ఎంపిక చేశారు. అయితే పిక్క కండ‌రాల గాయంతో కోహ్లీ ఈ సిరీస్‌కు దూర‌మైన‌ట్లు బీసీసీఐ ప్ర‌క‌టించింది. దీంతో కోహ్లీ స్థానంలో జ‌ట్టులోకి వ‌చ్చేది ఎవ‌ర‌నే దానిపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌రుగుతోంది. 

ఆఫ్గ‌న్‌తో వ‌న్డే సిరీస్‌కు కోహ్లీ స్థానంలో రుతురాజ్ గైక్వాడ్‌ను ఎంపిక చేసిన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. జూన్ 13న ధ‌ర్మ‌శాల వేదిక‌గా జ‌ర‌గ‌నున్న తొలి వ‌న్డేకు రుతురాజ్ అందుబాటులో ఉంటాడని బీసీసీఐ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసిన‌ట్లు నివేదిక‌లు వ‌చ్చాయి. కానీ రుతురాజ్ గైక్వాడ్ భార‌త-ఏ జ‌ట్టుతో క‌లిసి శ్రీలంక ప‌ర్య‌ట‌నకు బ‌య‌ల్దేరి వెళ్లిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో ప్ర‌త్య‌క్షం కావ‌డంతో  ఈ వార్త‌ల‌న్నింటికీ ఫుల్‌స్టాప్ ప‌డిన‌ట్ల‌యింది.

లంక ప‌ర్య‌ట‌న‌లో భార‌త్‌.. శ్రీలంక‌-ఏ, అప్గానిస్తాన్‌-ఏ జ‌ట్ల‌తో క‌లిసి ట్రై సిరీస్ ఆడ‌నుంది. తాజాగా రుతురాజ్ కొలంబోలో ద‌ర్శ‌న‌మివ్వ‌డంతో మ‌రి కోహ్లీ స్థానంలో ఆడే ఆట‌గాడు ఎవ‌ర‌న్న‌ది ఇంకా మిస్ట‌రీగానే ఉండిపోయింది. అయితే ఆర్సీబీ కెప్టెన్ ర‌జ‌త్ పాటీదార్ పేరు కూడా ప‌రిశీల‌న‌లో ఉన్న‌ట్లు సమాచారం.

ఎటూ తేల్చని బీసీసీఐ?
ఆఫ్గ‌న్‌తో వ‌న్డే సిరీస్‌కు 15 మందితో జ‌ట్టును ప్ర‌క‌టించ‌డంతో కోహ్లీ దూర‌మైన అత‌డి స్థానాన్ని ఆ సిరీస్‌కు ఎంపికైన ఆట‌గాళ్ల‌లో ఒక‌రితోనే భ‌ర్తీ చేయాల‌నే నిర్ణ‌యానికి బీసీసీఐ వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. కోహ్లీతో పాటు రోహిత్ శ‌ర్మ కూడా ఆఫ్గ‌న్‌తో వ‌న్డే సిరీస్ ఆడడం అనుమానంగానే ఉంది. అత‌డు కూడా పిక్క కండ‌రాల గాయంతో బాధ‌ప‌డుతుండడం టీమిండియాకు ప్ర‌తికూలంగా మార‌నుంది. 

మ‌రోవైపు ఆల్‌రౌండ‌ర్ హార్దిక్ పాండ్యా కూడా వెన్నునొప్పితో బాధ‌ప‌డుతున్న‌ట్లు తెలుస్తోంది. ఇలా జ‌ట్టులోని సీనియ‌ర్లంతా గాయాల బారిన ప‌డ‌డంతో వ‌న్డే సిరీస్‌లో అప్గానిస్తాన్ మన‌కు షాక్ ఇచ్చినా ఆశ్చ‌ర్య‌పోన‌స‌రం లేద‌ని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. కోహ్లీ, రోహిత్, పాండ్యాలు దూర‌మైతే మాత్రం బీసీసీఐ వీరి స్థానంలో క‌నీసం ఇద్ద‌రినైనా జ‌ట్టులోకి తీసుకోవాల్సిన అవ‌స‌ర‌ముంటుంది. అయితే వ‌న్డే సిరీస్‌కు ఇంకా స‌మ‌యం ఉండ‌డంతో బీసీసీఐ దీనిపై ఏదో ఒక నిర్ణ‌యం తీసుకోనుంది.

ఆఫ్గ‌న్‌తో వ‌న్డే సిరీస్‌కు టీమిండియా
శుబ్‌మన్ గిల్ (కెప్టెన్‌), రోహిత్ శర్మ, శ్రేయ‌స్ అయ్యర్ (వైస్ కెప్టెన్‌), కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, ప్రిన్స్ యాదవ్, గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబే

చదవండి: ఫిఫాకు ట్రోఫీ తిరిగివ్వని బ్రెజిల్‌.. విలువెంతో తెలుసా?

Advertisement
 
Advertisement
Advertisement