ప్రిక్వార్టర్స్‌లో సాత్విక్‌–చిరాగ్‌ జోడీ | Satwik and Chirag pair up in the pre quarters | Sakshi
Sakshi News home page

ప్రిక్వార్టర్స్‌లో సాత్విక్‌–చిరాగ్‌ జోడీ

Jan 9 2025 4:05 AM | Updated on Jan 9 2025 4:05 AM

Satwik and Chirag pair up in the pre quarters

ప్రణయ్, మాళవిక శుభారంభం 

మలేసియా ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ

కౌలాలంపూర్‌: భారత బ్యాడ్మింటన్‌ డబుల్స్‌ స్టార్‌ ద్వయం సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి మలేసియా ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–1000 టోర్నీలో ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లింది. బుధవారం జరిగిన పురుషుల డబుల్స్‌ తొలి రౌండ్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సాత్విక్, మహారాష్ట్ర ప్లేయర్‌ చిరాగ్‌ శెట్టి 21–10, 16–21, 21–5తో మింగ్‌ చె లు–టాంగ్‌ కాయ్‌ వె (చైనీస్‌ తైపీ)లపై గెలుపొందారు. 

56 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో భారత జోడీ తొలి గేమ్‌ను నెగ్గినా... రెండో గేమ్‌లో తడబడింది. అయితే నిర్ణాయక మూడో గేమ్‌లో సాతి్వక్‌–చిరాగ్‌ చెలరేగి ప్రత్యర్థి జోడీ ఆట కట్టించారు.  సింగిల్స్‌ విభాగంలో భారత క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. పురుషుల సింగిల్స్‌లో హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్‌ చేరుకోగా... ప్రియాన్షు రజావత్‌ తొలి రౌండ్‌లోనే ఇంటిముఖం పట్టాడు. 

ప్రణయ్‌ 21–12, 17–21, 21–15తో బ్రియాన్‌ యాంగ్‌ (కెనడా)పై నెగ్గగా... ప్రియాన్షు 11–21, 16–21తో ఏడో సీడ్‌ షి ఫెంగ్‌ లీ (చైనా) చేతిలో ఓడిపోయాడు.  మహిళల సింగిల్స్‌లో మాళవిక బన్సోద్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లగా... అనుపమా , ఆకర్షి కశ్యప్‌ తొలి రౌండ్‌లోనే ఓడిపోయారు. 

మాళవిక 21–15, 21–16తో గో జిన్‌ వె (మలేసియా)పై విజయం సాధించగా... ఆకర్షి 14–21, 12–21తో జూలీ జేకబ్సన్‌ (డెన్మార్క్‌) చేతిలో, అనుపమ 17–21, 21–18, 8–21తో పోర్న్‌పవీ చోచువోంగ్‌ (థాయ్‌లాండ్‌) చేతిలో ఓటమి పాలయ్యారు. 

Advertisement
 
Advertisement
Advertisement