గాలే వేదికగా శ్రీలంక ‘ఎ’ జట్టుతో జరుగుతున్న రెండో అనాధికారిక టెస్ట్లో భారత ‘ఎ’ జట్టు అద్భుతమైన కమ్బ్యాక్ ఇచ్చింది. తొలి రోజు విఫలమైన భారత బౌలర్లు రెండో రోజు మాత్రం విజృంభించారు. 288/5 స్కోరుతో రెండో రోజు ఆటను కొనసాగించిన శ్రీలంక ‘ఎ’ జట్టు 366 పరుగులకు ఆలౌటైంది.
లంక కెప్టెన్ బాధ్యతాయుతంగా ఆడి 127 పరుగులు చేశాడు. భారత బౌలర్లలో గుర్నూర్ బ్రార్, సరాన్ష్ జైన్ తలా నాలుగు వికెట్లు పడగొట్టి లంకను దెబ్బకొట్టారు. వీరితో పాటు యాష్ ఠాకూర్ రెండు వికెట్లు పడగొట్టాడు.
సుదర్శన్ సూపర్ సెంచరీ
అనంతరం తమ తొలి ఇన్నింగ్స్ను ఆరంభించిన భారత్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి నష్టానికి 247 పరుగుల స్కోర్ సాధించింది.అమన్ మోఖడే(38) త్వరగా ఔటైనప్పటికి.. మరో ఓపెనర్ సాయిసుదర్శన్ మాత్రం శతక్కొట్టాడు. సుదర్శన్ 13 ఫోర్ల సహాయంతో 104 పరుగులు చేసి క్రీజులో నాటౌట్గా ఉన్నాడు.
అతడితో పాటు దేవదత్ పడిక్కల్ 94 పరుగులు చేసి సెంచరీకి చేరువలో నిలిచాడు. ఇండియా-ఎ జట్టు తొలి ఇన్నింగ్స్లో శ్రీలంక కంటే ఇంకా 119 పరుగుల వెనుకంజలో ఉంది. సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్ రెండో వికెట్కు 209 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. మూడో రోజు ఆటలో భారత్ భారీ స్కోర్ సాధించే అవకాశముంది.


