రోహిత్ శ‌ర్మకు బిగ్‌ షాక్‌.. టీమిండియా కెప్టెన్‌గా స్టార్‌ ప్లేయర్‌? | Rohit Sharma unlikely to be picked for Tests again, Bumrah to captain India in England Tests: Reports | Sakshi
Sakshi News home page

ENG vs IND: రోహిత్ శ‌ర్మకు బిగ్‌ షాక్‌.. టీమిండియా కెప్టెన్‌గా స్టార్‌ ప్లేయర్‌?

Feb 15 2025 3:08 PM | Updated on Feb 15 2025 3:53 PM

Rohit Sharma unlikely to be picked for Tests again, Bumrah to captain India in England Tests: Reports

టీమిండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ(Rohitsharma) టెస్టు భ‌విష్య‌త్తు ప్ర‌శ్న‌ర్థ‌కంగా మారింది. గ‌తేడాదిగా టెస్టు క్రికెట్‌లో రోహిత్ శ‌ర్మ దారుణ‌మైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రుస్తున్న సంగ‌తి తెలిసిందే. అటు కెప్టెన్‌గా, ఇటు బ్యాటింగ్ ప‌రంగా రోహిత్ పూర్తిగా తేలిపోతున్నాడు. గ‌తేడాది ఆఖ‌రిలో స్వ‌దేశంలో న్యూజిలాండ్‌తో జ‌రిగిన టెస్టు సిరీస్‌లో రోహిత్ శ‌ర్మ సార‌థ్యంలోని భార‌త జ‌ట్టు వైట్‌వాష్‌కు గురైంది.

స్వ‌దేశంలో ప్ర‌త్య‌ర్ధి చేతిలో మూడు లేదా అంత‌కంటే ఎక్కువ మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భార‌త్ వైట్‌వాష్ కావ‌డం ఇదే మొద‌టి సారి. ఆ త‌ర్వాత బోర్డ‌ర్-గ‌వాస్క‌ర్ ట్రోఫీలోనూ రోహిత్ తీరు మార‌లేదు. తొలి టెస్టుకు వ్య‌క్తిగ‌త కార‌ణాల‌తో దూర‌మైన హిట్‌మ్యాన్‌.. ఆ త‌ర్వాతి మ్యాచ్‌ల‌కు అందుబాటులోకి వ‌చ్చాడు. తొలి టెస్టులో విజ‌యం సాధించిన భార‌త్‌.. రోహిత్ వ‌చ్చాక వ‌రుస‌గా మూడు మ్యాచ్‌లలో ఓట‌మి చ‌విచూసింది.

ఈ మూడు మ్యాచ్‌ల‌లోనూ రోహిత్ తీవ్ర నిరాశ‌ప‌రిచాడు. దీంతో ఆఖరి టెస్టుకు భార‌త కెప్టెన్ త‌నంతంట త‌నే జ‌ట్టు నుంచి త‌ప్పుకున్నాడు. అనంత‌రం స్వ‌దేశంలో ఇంగ్లండ్‌తో జ‌రిగిన వ‌న్డే సిరీస్‌లో రోహిత్ ప‌ర్వాలేద‌న్పించాడు. తొలి వ‌న్డేలో విఫ‌ల‌మైన ఈ ముంబైక‌ర్‌.. ఆ త‌ర్వాతి రెండో వ‌న్డేలో మాత్రం విధ్వంస‌క‌ర శ‌త‌కంతో చెల‌రేగాడు

అయితే ఆ జోరును మూడో వ‌న్డేలో కొన‌సాగించ‌లేక‌పోయాడు. ఇప్పుడు ఛాంపియ‌న్స్ ట్రోఫీ-2025కు రోహిత్ సిద్ద‌మ‌వుతున్నాడు. ఈ మెగా టోర్నీ త‌ర్వాత శ‌ర్మ భ‌విష్య‌త్తుపై ఓ క్లారిటీ వ‌చ్చే అవ‌కాశముంది. ఏదేమైన‌ప్ప‌టికి టెస్టుల్లో మాత్రం రోహిత్ కెరీర్ ముగిసిన‌ట్లేన‌ని తాజా రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి.

కెప్టెన్‌గా బుమ్రా..?
ఈ ఏడాది జూన్‌లో ఇంగ్లండ్‌తో జ‌రిగే టెస్టు సిరీస్‌కు  హిట్‌మ్యాన్‌ను ఎంపిక చేసే అవకాశం లేదని పిటిఐ త‌మ నివేదిక‌లో పేర్కొంది. అత‌డి స్ధానంలో స్టార్ పేస‌ర్ జ‌స్ప్రీత్ బుమ్రా(Jasprith Bumrah)కు జ‌ట్టు ప‌గ్గాల‌ను అప్ప‌గించాల‌ని అజిత్ అగార్కర్ నేతృత్వంలోని బీసీసీఐ సెలక్షన్ కమిటీ భావిస్తున్నట్లు సమాచారం.

కాగా బుమ్రా ప్రస్తుతం గాయం కారణంగా ఆటకు దూరంగా ఉన్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీకి సైతం అతడు దూరమయ్యాడు. బుమ్రా తిరిగి ఐపీఎల్‌-2025తో తిరిగి మైదానంలో అడుగపెట్టే అవకాశముంది. కాగా ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో బుమ్రా రెండు పర్యాయాలు భారత జట్టుకు నాయకత్వం వహించాడు.

పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో బుమ్రా సారథ్యంలోని భారత జట్టు  295 పరుగుల తేడాతో ఆసీస్‌ను చిత్తు చేసింది. బుమ్రా మరోసారి సిడ్నీలో జరిగిన ఆఖరి టెస్టులో భారత జట్టు కెప్టెన్‌గా వ్యవహరించాడు. అయితే ఈ మ్యాచ్‌లో బుమ్రా గాయం కారణంగా మధ్యలోనే వైదొలగడంతో టీమిండియా ఓటమి చవిచూసింది.

ఒకే ఒక హాఫ్‌ సెంచరీ..
గత 15 టెస్టు ఇన్నింగ్స్‌లో రోహిత్‌ శర్మ 164 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఇందులో ఒక అర్ధ సెంచరీ ఉంది. రోహిత్ గత 15 ఇన్నింగ్స్‌లో వరుసగా 6, 5, 23, 8, 2, 52, 0, 8, 18, 11, 3, 6, 10 పరుగులు చేశాడు. చివరగా మెల్‌బోర్న్‌ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 3 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 9 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరాడు. ఈ ఏడాది 14 టెస్టులాడిన రోహిత్‌.. 26 ఇన్నింగ్స్‌లో 24.76 సగటుతో 619 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, మరో రెండు హాఫ్‌ సెంచరీలున్నాయి.
చదవండి: రోహిత్‌, కోహ్లితో పాటు అతడికి ఇదే ఆఖరి ఐసీసీ టోర్నీ: భారత మాజీ క్రికెటర్‌

Advertisement
 
Advertisement
Advertisement