‘ధోనికి రుణపడి ఉంటా’అశ్విన్‌ భావోద్వేగం  | Ravichandran Ashwin about dhoni | Sakshi
Sakshi News home page

‘ధోనికి రుణపడి ఉంటా’అశ్విన్‌ భావోద్వేగం 

Mar 17 2024 4:21 AM | Updated on Mar 17 2024 4:21 AM

Ravichandran Ashwin about dhoni - Sakshi

చెన్నై: దాదాపు 13 ఏళ్ల క్రితం తనకంటూ ఎలాంటి గుర్తింపు లేని రోజుల్లో అండగా నిలిచి అవకాశాలు కల్పించిన మహేంద్ర సింగ్‌ ధోనికి తాను జీవితకాలం రుణపడి ఉంటానని భారత స్టార్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ అన్నాడు. 100 టెస్టులు పూర్తి చేసుకోవడంతో పాటు 500 వికెట్ల మైలురాయిని దాటిన అశ్విన్‌ను శనివారం తమిళనాడు క్రికెట్‌ సంఘం (టీఎన్‌సీఏ) ఘనంగా సన్మానించింది.

ఈ సందర్భంగా తన కెరీర్‌ను మలుపు తిప్పిన 2011 ఐపీఎల్‌ ఫైనల్‌ను అశ్విన్‌ గుర్తు చేసుకున్నాడు. ‘కొత్త బంతితో నన్ను క్రిస్‌ గేల్‌కు బౌలింగ్‌ చేసే అవకాశాన్ని ధోని కల్పించాడు. నాలుగో బంతికే నేను వికెట్‌ తీయగలిగా. ఇప్పటికీ చాలా మంది దాని గురించి మాట్లాడుకుంటున్నారంటే అందుకు ధోనినే కారణం. అతనికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటా. సాధారణంగా నేను మాట్లాడేప్పుడు పదాల కోసం ఎప్పుడూ తడబడను.

కానీ ఈ రోజు నా పరిస్థితి భిన్నంగా ఉంది. టీఎన్‌సీఏ నాకు ఎంతో గౌరవం కల్పించింది కాబట్టే ఎప్పుడైనా క్లబ్‌ క్రికెట్‌ కూడా సిద్ధంగా ఉంటా. నేను రేపు చచ్చిపోయినా నా ఆత్మ ఈ స్టేడియంలోనే తిరుగుతూ ఉంటుంది’ అని అశ్విన్‌ అన్నాడు. ఈ సన్మాన కార్యక్రమంలో అశ్విన్‌కు ప్రత్యేక జ్ఞాపికగా ‘సెంగోల్‌’ అందించడం, అతని పేరిట స్టాంప్‌ విడుదలతో పాటు రూ. 1 కోటి నగదు పురస్కారాన్ని కూడా అందించారు.   

Advertisement
 
Advertisement
Advertisement