
షమీతో ఫలితం రాబట్టిన రవిశాస్త్రి
న్యూఢిల్లీ: భారత పేసర్ బౌలర్ మొహమ్మద్ షమీకి బిర్యానీ అంటే చాలా ఇష్టం. పేసర్గా ఒకవైపు తన ఫిట్నెస్ను కాపాడుకుంటూనే బిర్యానీపై ఇష్టాన్ని అతను ఎప్పుడూ దాచుకోలేదు. సహచర క్రికెటర్లు కూడా చాలా సందర్భాల్లో ఈ విషయాన్ని చెప్పారు. అయితే షమీ–బిర్యానీకి సంబంధించి మరో ఆసక్తికర అంశాన్ని మాజీ కోచ్ రవిశాస్త్రి పంచుకున్నాడు. అతనికి ఇష్టమైన బిర్యానీ ద్వారానే షమీని రెచ్చగొట్టి ఫలితం సాధించిన విషయాన్ని అతను గుర్తు చేసుకున్నాడు.
2018 దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా తొలి రెండు టెస్టులు ఓడి భారత్ సిరీస్ కోల్పోయింది. చివరి టెస్టులోనూ పరాజయం దిశగా సాగుతోంది. లక్ష్య ఛేదనలో చేతిలో 8 వికెట్లతో మరో 100 పరుగులు మాత్రమే దక్షిణాఫ్రికా సాధించాల్సి ఉంది. ఇలాంటి స్థితిలో లంచ్ విరామ సమయంలో డ్రెస్సింగ్ రూమ్లో షమీ ఒక పెద్ద ప్లేటు నిండుగా బిర్యానీ పెట్టుకొని తినేందుకు సిద్ధమయ్యాడు. దాంతో ‘ఇంత తింటే నీ ఆకలి తీరుతుందా’ అని రవిశాస్త్రి అసహనాన్ని ప్రదర్శించాడు. ఇది షమీకి బాగా కోపం తెప్పించింది.
‘ఇదిగో, ఈ ప్లేట్ తీసేసుకో. నాకేమీ అవసరం లేదు. నీ బిర్యానీ ఎక్కడైనా పోనీ’ అని అతను ఆగ్రహంగా స్పందించాడు. పరిస్థితిని గమనించిన రవిశాస్త్రి బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ను పక్కకు పిలిచి ‘అతడిని ఒంటరిగా వదిలేయండి. ఏదైనా నాతో మాట్లాడాలంటే వికెట్లు తీసిన తర్వాత రమ్మనండి’ అని చెప్పాడు. ఈ ఘటనతో షమీ రెచ్చిపోయాడు. అతను వరుసగా వికెట్లు తీయడంతో దక్షిణాఫ్రికా కుప్పకూలింది.
చివరి 8 మంది బ్యాటర్లు కలిపి 22 పరుగులు మాత్రమే చేయడంతో 63 పరుగులతో భారత్ విజయం సాధించింది. దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్లో షమీ 5 వికెట్లు పడగొట్టడం విశేషం. మ్యాచ్ ముగిశాక అదే ప్లేట్ను ఇచ్చి ‘ఇప్పుడు ఎంత బిర్యానీ కావాలో తిను’ అంటూ భరత్ అరుణ్ చెప్పడంతో పరిస్థితి సాధారణంగా మారిపోయింది.