అశ్విన్‌, భజ్జీ కాదు!.. టీమిండియా ఆల్‌టైమ్‌ అత్యుత్తమ స్పిన్నర్లు వీరే! | Ravi Shastri Picks All Time 3 Best Indian Spinners; Ignores Ashwin, Jadeja, Harbhajan | Sakshi
Sakshi News home page

అశ్విన్‌, భజ్జీ కాదు!.. టీమిండియా ఆల్‌టైమ్‌ అత్యుత్తమ స్పిన్నర్లు వీరే!

Nov 29 2024 1:53 PM | Updated on Nov 29 2024 2:50 PM

Ravi Shastri Picks All Time 3 Best Indian Spinners; Ignores Ashwin, Jadeja, Harbhajan

టీమిండియా మాజీ హెడ్‌కోచ్‌ రవిశాస్త్రి ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉన్నాడు. భారత్‌- ఆసీస్‌ మధ్య జరుగుతున్న బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ సిరీస్‌కు కామెంటేటర్‌గా ‍వ్యవహరిస్తున్నాడు. ఈ క్రమంలో రవిశాస్త్రికి ఓ ప్రశ్న ఎదురైంది. భారత క్రికెట్‌ జట్టులోని ముగ్గురు అత్యుత్తమ స్పిన్నర్ల పేర్లు చెప్పాలని కోరగా.. రవిశాస్త్రి ఆసక్తికర సమాధానం ఇచ్చాడు.

కాగా ప్రస్తుతం టీమిండియా తరఫున టెస్టుల్లో అత్యధిక వికెట్ల వీరుల జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు రవిచంద్రన్‌ అశ్విన్‌. మరోవైపు.. మాజీ ఆఫ్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ సైతం 103 టెస్టుల్లో 417 వికెట్లు పడగొట్టి లెజెండరీ బౌలర్‌గా పేరు సంపాదించాడు.

ఇక అశ్విన్‌తో పాటు జట్టులో ​కొనసాగుతున్న మరో స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా కూడా 319(77 టెస్టుల్లో) వికెట్లు పడగొట్టి సత్తా చాటుతున్నాడు.

అనిల్‌ కుంబ్లే ప్రమాదకారి
అయితే, రవిశాస్త్రి ఈ ముగ్గురిలో ఒక్కరి పేరు కూడా చెప్పకపోవడం విశేషం. తన దృష్టిలో బిషన్‌ సింగ్‌ బేడి, ఎర్రాపల్లి ప్రసన్న, అనిల్‌ కుంబ్లే టీమిండియా అత్యుత్తమ స్పిన్నర్లు అని పేర్కొన్నాడు. ఈ మేరకు ఫాక్స్‌ స్పోర్ట్స్‌ షోలో  మాట్లాడుతూ.. ‘‘ఉపఖండ పిచ్‌లపై అనిల్‌ కుంబ్లే ప్రమాదకారి. 

అత్యంత దూకుడుగా ఉంటాడు. అయితే, కేవలం ఇండియాలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటిన స్పిన్నర్‌. 600కు పైగా టెస్టు వికెట్లు తీయడం అంటే మాటలు కాదు.

అతడు బంతితో అద్భుతాలు చేయగలడు
ఇక ప్రసన్న. అతడి కెరీర్‌ చరమాంకంలో ఉన్నపటి పరిస్థితులను పరిశీలిస్తే.. అతడు జట్టు మేనేజర్‌గా ఆస్ట్రేలియా పర్యటనకు వచ్చాడు. నెట్స్‌లో బౌలింగ్‌ కూడా చేశాడు. అతడు బంతితో అద్భుతాలు చేయగలడు. బాల్‌ను రిలీజ్‌ చేసే విషయంలో ఎప్పుడు ఏం చేయాలో అతడికి బాగా తెలుసు.

ఆయన బౌలింగ్‌ యాక్షన్‌ సూపర్‌
వీరిద్దరు నా లిస్టులో టాప్‌-3లో ఉంటే.. టాప్‌-1లో బిషన్‌ సింగ్‌ బేడి ఉంటాడు. ఆయన బౌలింగ్‌ యాక్షన్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే’’ అని రవిశాస్త్రి పేర్కొన్నాడు. తన అభిప్రాయం ప్రకారం బిషన్‌ బేడి, ప్రసన్న, కుంబ్లే అత్యుత్తమ భారత స్పిన్నర్లు అని పేర్కొన్నాడు. 

కాగా బిషన్‌ బేడీ తన కెరీర్‌లో 67 టెస్టుల్లో 266 వికెట్లు పడగొట్టగా.. ప్రసన్న 49 టెస్టుల్లో 189 వికెట్లు తీశాడు. మరోవైపు.. కుంబ్లే 132 టెస్టుల్లో 619 వికెట్లు కూల్చి టెస్టుల్లో భారత లీడింగ్‌ వికెట్‌ టేకర్‌గా కొనసాగుతున్నాడు. ఇక 536 వికెట్లతో అశూ రెండోస్థానంలో ఉన్నాడు

చదవండి: IPL 2025: ఆర్సీబీ కెప్టెన్‌ అతడే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement