Rahi Sarnobat: రాహీ పసిడి గురి

Rahi Sarnobat wins gold medal in womens 25meters pistol event - Sakshi

25 మీటర్ల పిస్టల్‌ విభాగంలో స్వర్ణం

ఒసిజెక్‌ (క్రొయేషియా): ప్రపంచకప్‌ షూటింగ్‌ టోర్నమెంట్‌లో భారత్‌కు తొలి పసిడి పతకం లభించింది. సోమవారం జరిగిన మహిళల 25 మీటర్ల పిస్టల్‌ ఈవెంట్‌లో రాహీ సర్నోబత్‌ బంగారు పతకాన్ని సొంతం చేసుకుంది. మహారాష్ట్రకు చెందిన 30 ఏళ్ల రాహీ ఎనిమిది మంది పాల్గొన్న ఫైనల్లో 39 పాయింట్లు స్కోరు చేసింది. లామోలి మథిల్డె (ఫ్రాన్స్‌–31 పాయింట్లు) రజతం, వితాలినా (రష్యా–28 పాయింట్లు) కాంస్యం సాధించారు. ఎలిమినేషన్‌ పద్ధతిలో జరిగిన ఫైనల్లో భారత్‌కే చెందిన మరో షూటర్‌ మనూ భాకర్‌ 11 పాయింట్లు స్కోరు చేసి ఏడో స్థానంతో సరిపెట్టుకుంది.

49 మంది షూటర్లు పాల్గొన్న క్వాలిఫయింగ్‌లో రాహీ 591 పాయింట్లు... మనూ 588 పాయింట్లు స్కోరు వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించారు. మరోవైపు మహిళల 50 మీటర్ల రైఫిల్‌ త్రీ పొజిషన్‌ ఈవెంట్‌లో భారత షూటర్‌ తేజస్విని సావంత్‌ క్వాలిఫయింగ్‌లో పదో స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత పొందలేకపోయింది. ఓవరాల్‌గా ఈ టోర్నీలో ఇప్పటి వరకు భారత్‌ స్వర్ణం, రజతం, రెండు కాంస్యాలతో కలిపి మొత్తం నాలుగు పతకాలు గెల్చుకుంది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top