Photo Credit: Twitter
పాకిస్తాన్ బ్యాటర్ ఇమామ్-ఉల్-హక్ గాయం విషయమై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ప్రత్యేక అధికారుల బృందం సీరియస్ విచారణ చేయనున్నట్లు తెలుస్తోంది. పిక్క కండరాల గాయంతో ఇమామ్-ఉల్-హక్ మూడో టెస్టు ఆడకుండానే స్వదేశానికి తిరుగుపయనమ య్యాడు. లార్డ్స్ వేదికగా ముగిసిన రెండో టెస్టులో తొలి రోజు ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో ఇమామ్ పిక్క కండరాల నొప్పితో బాధపడ్డాడు.
అయితే స్కానింగ్లో ఇమామ్కు స్వల్ప గాయం మాత్రమే అయినట్లు నిర్థరాణ అయింది. నిజానికి ఇమామ్ ఉల్ హక్కు పెద్దగా గాయం కాలేదని, కానీ కఠిన పరిస్థితుల్లో ఇంగ్లండ్ బౌలర్లను ఎదుర్కోవడానికి భయపడి గాయం పేరుతో ఇలా నాటకాలు ఆడినట్లు సోషల్ మీడియాలో పుకార్లు వ్యాపించాయి.
ఇంగ్లండ్ గడ్డపై ఆడేందుకు భయపడే ఇమామ్-ఉల్-హక్ నకిలీ గాయం పేరుతో తప్పించుకునే ప్రయత్నం చేశాడని మాజీ పాక్ క్రికెటర్లు ఆరోపించారు. దీంతో రంగంలోకి దిగిన పీసీబీ ఇమామ్ గాయం నిజామా? కాదా? అన్నది తేల్చేందుకు అధికార యంత్రాంగంతో విచారణ ప్రారంభించనుంది.
గతంలోనూ ఇలాగే..
ఇమామ్ ఉల్ హక్పై ఇలాంటి ఆరోపణలు రావడం ఇదేమీ కొత్త కాదు. 2025లో న్యూజిలాండ్ పర్యటన సందర్భంగా నేపియర్ వేదికగా తొలి వన్డేకు ముందు తన కాలి కుడి బొటనవేలిలో తీవ్రమైన నొప్పి ఉందని పీసీబీకి ఫిర్యాదు చేశాడు. అయితే ఎక్స్-రేల్లో మాత్రం బొటనవేలులో ఎలాంటి చీలిక లేదా స్థానభ్రంశం జరిగినట్లు ఆధారాలు కనిపించలేదు.
పాక్ క్రికెట్ వైద్య బృందం ప్రకారం, ఇమామ్ కాలి బొటనవేలు నుంచి వచ్చింది రక్తం కాదని, అది సిరా గుర్తు అని తమ నివేదికలో తేలినట్లు అప్పట్లో పేర్కొంది. కేవలం న్యూజిలాండ్లోని పేస్ పిచ్లపై బ్యాటింగ్ చేయడాన్ని తప్పించుకోవడానికే ఇమామ్ ఉల్ హక్ గాయమైనట్లు నటించాడని వార్తలు వచ్చాయి.
అవసరమైతే నిషేధం..
పీసీబీ విచారణ సమయంలో వారి వద్దకు వచ్చినప్పుడు ఇమామ్ కుంటుతూ నడిచాడని, వాళ్లు వెళ్లిపోయాక బయటకు మాత్రం యథావిధిగా నడుచుకుంటూ వచ్చాడని సమాచారం అందింది. అందుకే ఈసారి పీసీబీ దీనిపై సీరియస్ యాక్షన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.
‘‘ఇమామ్కు గాయం నిజమైతే పర్వాలేదు కానీ, ఒకవేళ గాయం తీవ్రత పెద్దగా లేకపోయినప్పటికీ, నటించినట్లు తేలితే మాత్రం ఈసారి అతడిపై కఠిన చర్యలకు ఆస్కారం ఉంటుంది. అవసరమైతే జట్టు నుంచి సస్పెండ్ చేసే యోచనలో ఉన్నాం’’ అని పీసీబీ ఒక ప్రకటనలో పేర్కొంది.
ఇక ఇంగ్లండ్తో రెండో టెస్టు ముగిసిన అనంతరం ఇమామ్ ఉల్ హక్తో పాటు సీనియర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ కూడా స్వదేశానికి తిరుగుపయనమయ్యాడు. ఇక మూడో టెస్టు కోసం పాకిస్తాన్ జట్టులో స్వల్ప మార్పులు జరగనున్నాయి. ఇప్పటికే చివరి టెస్టు కోసం సయీమ్ అయూబ్, అరాఫత్ మిన్హాస్ సహా ఆరుగురు ఆటగాళ్లను ఇంగ్లండ్కు పిలిపించింది.
సర్ఫరాజ్ అహ్మద్పై వేటు!
ఇక ప్రస్తుతం రెడ్బాల్ క్రికెట్ కోచ్గా ఉన్న సర్ఫరాజ్ అహ్మద్పై వేటు పటే అవకాశాలున్నాయి. సర్ఫరాజ్ అహ్మద్ స్థానంలో ప్రస్తుతం వైట్బాల్ క్రికెట్ కోచ్గా వ్యవహరిస్తున్న మైక్ హసన్కే బాధ్యతలు అప్పగించే అవకాశాలున్నాయి. ఇప్పటికే ఇంగ్లండ్కు 2-0తో సిరీస్ కోల్పోయిన పాకిస్తాన్ మూడో టెస్టును ఎడ్జ్బాస్టన్ వేదికగా సెప్టెంబర్ 9 నుంచి ఆడనుంది.


