పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ ఆఘాపై భారతీయ నెటిజన్లు భగ్గుమంటున్నారు. బంగ్లాదేశీయలు తమ సోదరులు అంటూ అతడు చేసిన వ్యాఖ్యలపై సెటైర్లు వేస్తున్నారు. బంగ్లాదేశ్కు గట్టిగా బుద్ధి చెప్పిన అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) పాకిస్తాన్కు కూడా సరైన సమాధానం ఇవ్వాలని సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేస్తున్నారు.
భారత్- బంగ్లా ఉద్రిక్తతలు
కాగా 1971లో బంగ్లాదేశ్ ఆవిర్భవించిన విషయం తెలిసిందే. పశ్చిమ పాకిస్తాన్ ఆగడాలు తట్టుకోలేక విలవిల్లాడిన తూర్పు ప్రజలకు భారత సైన్యం అండగా నిలిచింది. ఫలితంగా బంగ్లాదేశ్కు స్వతంత్రత వచ్చింది. ఈ యుద్ధంలో సుమారుగా 3900 మంది భారతీయ సైనికులు ప్రాణత్యాగం చేశారు.
ఇలా బంగ్లాదేశ్కు ఆది నుంచి భారత్ అండగా ఉంటోంది. అయితే, ఇటీవల కొంతమంది బంగ్లా నేతలు భారత్ భూభాగాల గురించి అవాకులు చెవాకులు పేలడమే కాకుండా.. ఉగ్రవాదులకు తాము ఆశ్రయమిస్తే ఎలా ఉంటుందో తెలుస్తుంది అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు మైనారిటీ హిందువులపై బంగ్లాలో హత్యాకాండ జరిగింది.
టోర్నీ నుంచి అవుట్
ఈ నేపథ్యంలో ఐపీఎల్ నుంచి బంగ్లాదేశ్ ఫాస్ట్బౌలర్ ముస్తాఫిజుర్ రహమాన్ తొలగించాలనే డిమాండ్లు రాగా.. బీసీసీఐ అందుకు సానుకూలంగా స్పందించింది. ఈ క్రమంలో తమ ఆటగాళ్లకు భారత్లో భద్రత ఉండదంటూ టీ20 ప్రపంచకప్-2026లో తమ వేదికను భారత్ నుంచి శ్రీలంకకు మార్చాల్సిందిగా బంగ్లా ఐసీసీని కోరింది.
పాక్ ఓవరాక్షన్
అయితే, బంగ్లా ఆరోపణలను కొట్టిపారేసిన ఐసీసీ.. తుదినిర్ణయం చెప్పాలని గడువు ఇచ్చింది. అయినప్పటికి బంగ్లా పట్టువీడకపోవడంతో టోర్నీ నుంచి తొలగించింది. ఈ నేపథ్యంలో తటస్థ వేదికైన శ్రీలంకలో మ్యాచ్లు ఆడాల్సి ఉన్న పాక్ సైతం టోర్నీ బహిష్కరిస్తామని తొలుత.. ఆ తర్వాత భారత్తో మ్యాచ్ బహిష్కరిస్తామని ప్రకటించింది.
ఈ నేపథ్యంలో ‘థాంక్యూ పాకిస్తాన్’ అని బంగ్లాదేశ్ యువజన, క్రీడా శాఖ సలహాదారు ఆసిఫ్ నజ్రుల్ పాక్ ప్రధాని షెబాజ్ షరీఫ్నకు సోషల్ మీడియా వేదికగా ధన్యవాదాలు తెలిపాడు. తాజాగా పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ ఆఘా మీడియాతో మాట్లాడుతూ.. బంగ్లాదేశ్పై ప్రేమ ఒలకబోశాడు.
చరిత్ర గుర్తు చేసుకో
‘‘బంగ్లాదేశీయులు మా సోదరులు. పాకిస్తాన్కు మద్దతుగా ఉన్నందుకు వారికి రుణపడి ఉంటాము. కానీ వాళ్లు ఈసారి వరల్డ్కప్ టోర్నీ ఆడకపోవడం చూస్తుంటే బాధగా ఉంది’’ అంటూ సల్మాన్ ఆఘా పేర్కొన్నాడు.
ఈ నేపథ్యంలో చరిత్రను ఒక్కసారి గుర్తు చేసుకోవాలంటూ భారతీయ నెటిజన్లు అతడికి చురకలు అంటిస్తున్నారు. కాగా శనివారం నుంచి భారత్- శ్రీలంక వేదికలుగా టీ20 ప్రపంచకప్ టోర్నీ ఆరంభం కానుంది. పాక్ తమ తొలి మ్యాచ్లో నెదర్లాండ్స్తో తలపడుతుంది.
చదవండి: IND vs PAK: పాక్ నిర్ణయంపై తొలిసారి స్పందించిన బంగ్లాదేశ్.. పొట్టకొట్టేలా..


