టీ20 ప్రపంచకప్- 2026 ఆరంభానికి ముందు న్యూజిలాండ్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ బ్యాటర్లు రచిన్ రవీంద్ర, డెవాన్ కాన్వే అనారోగ్యం బారిన పడ్డారు. వీరిద్దరూ ప్రస్తుతం వైరల్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారు. దీంతో గురువారం అమెరికాతో జరగాల్సిన వార్మప్ మ్యాచ్కు వారిద్దరూ దూరమయ్యారు.
ఈ విషయాన్ని కివీస్ హెడ్ కోచ్ రాబ్ వాల్టర్ ధ్రువీకరించారు. రచిన్, కాన్వే ప్రస్తుతం తమ వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నారని అతడు తెలిపాడు. ఫిబ్రవరి 8న ఆఫ్ఘనిస్తాన్తో జరిగే మొదటి మ్యాచ్ నాటికి వీరిద్దరూ కోలుకుంటారని కోచ్ ఆశాభావం వ్యక్తం చేశాడు. కేవలం అనారోగ్యం మాత్రమే కాకుండా, గాయాలు కూడా కివీస్ జట్టును కలవరపెడుతున్నాయి.
విధ్వంసకర ఓపెనర్ ఫిన్ అలెన్ కూడా భుజం గాయం కారణంగా యూఎస్ఎతో వార్మప్ మ్యాచ్కు అందుబాటులో లేడు. స్టార్ పేసర్ ఆడమ్ మిల్నే ఇప్పటికే గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. అతడి స్ధానంలో కైల్ జేమీసన్ జట్టులోకి తీసుకున్నారు. మరోవైపు కీలక ఆల్రౌండర్ మైఖేల్ బ్రేస్వెల్ కాళ్ల కండరాల గాయం నుంచి కోలుకుంటున్నాడు.
బ్రేస్వెల్ మొదటి మ్యాచ్ సమయానికి పూర్తి ఫిట్నెస్ సాధించే అవకాశం ఉంది. అయితే స్పీడ్ స్టార్ లాకీ ఫెర్గూసన్ గాయం నుంచి కోలుకుని తిరిగి జట్టులోకి రావడం సానుకూల అంశంగా చెప్పుకోవాలి.
టీ20 ప్రపంచకప్ టోర్నీకి న్యూజిలాండ్ జట్టు ఇదే
మిచెల్ శాంట్నర్ (కెప్టెన్), ఫిన్ అలెన్,డెవాన్ కాన్వే (వికెట్ కీపర్), రచిన్ రవీంద్ర,డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్,టిమ్ సీఫెర్ట్ (వికెట్ కీపర్),మార్క్ చాప్మన్, మైఖేల్ బ్రేస్వెల్,జేమ్స్ నీషమ్,ఇష్ సోధి, లాకీ ఫెర్గూసన్


