
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ తేజం, రెండుసార్లు ప్రపంచ చాంపియన్ అయిన నిఖత్ జరీన్ సొంతగడ్డపై జరుగుతున్న ఎలైట్ మహిళల బాక్సింగ్ టోర్నమెంట్లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో ఆదివారం జరిగిన 51 కేజీల కేటగిరీ క్వార్టర్ ఫైనల్లో నిఖత్ 5–0తో కల్పన (సాయ్)పై ఏకపక్ష విజయం సాధించింది. మాజీ యూత్ ప్రపంచ చాంపియన్ అంకుషిత బొరో (టాప్స్) కూడా సెమీఫైనల్కు చేరింది.
65 కేజీ కేటగిరీలో జరిగిన క్వార్టర్ ఫైనల్లో ఆమె 5–0తో రాజస్తాన్ బాక్సర్ పార్థవిపై గెలిచింది. తెలంగాణ బాక్సర్లలో 65 కేజీల విభాగంలో యశి శర్మ 3–2తో సరిత రాయ్ (ఉత్తరప్రదేశ్)పై గెలుపొందగా, 60 కేజీల విభాగంలో గోనెళ్ల నిహారిక 5–0తో ప్రియాంక (చత్తీస్గఢ్)పై విజయం సాధించింది.
అయితే నిరూపమ, చిలువేరు అపర్ణలకు క్వార్టర్స్లోనే చుక్కెదురైంది. 57 కేజీ కేటగిరీలో అపర్ణ 0–5తో కమల్జీత్ కౌర్ (ఏఐపీ) చేతిలో, 54 కేజీ కేటగిరీలో నిరూపమ 0–5తో తను (ఎస్ఎస్సీబీ) చేతిలో పరాజయం చవిచూశారు. 48 కేజీల్లో వహి వజీర్ 0–5తో మంజురాణి చేతిలో ఓడింది.