MS Dhoni Farewell Game: ధోని ఫ్యాన్స్కు శుభవార్త.. ఫేర్వెల్ గేమ్పై క్లారిటీ
Dhoni Hints Playing Fare Well Game In Chennai: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన నాటి నుంచి అతని ఐపీఎల్ రిటైర్మెంట్పై కూడా రకరకాల వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఇప్పుడు, అప్పుడు అంటూ ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు ప్రకటనలు చేస్తూ వచ్చారు. అయితే వీటన్నిటిపై మాహీ తాజాగా ఓ క్లారిటీ ఇచ్చాడు. తన ఐపీఎల్ రిటైర్మెంట్ ఇప్పట్లో లేదని.. వచ్చే ఏడాది కూడా చెన్నై సూపర్ కింగ్స్ తరఫునే ఆడతానని.. తన ఫేర్వెల్ గేమ్ చెన్నైలోని చెపాక్లోనే ఉంటుందని సూచనప్రాయంగా వెల్లడించాడు. తాజాగా తన ఐపీఎల్ ఫ్రాంచైజీ ఇండియా సిమెంట్స్కు 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన వర్చువల్ సమావేశంలో మాట్లాడుతూ..
తన ఐపీఎల్ భవితవ్యంపై క్లారిటీ ఇచ్చాడు. ఈ ప్రకటనతో సీఎస్కే అభిమానులతో పాటు ధోని వ్యక్తిగత అభిమానులు ఆనందంలో మునిగితేలుతున్నారు. వారి ఆనందానికి పట్టపగ్గాలు లేకుండా పోయాయి. సోషల్మీడియా వేదికగా తెగ హల్చల్ చేస్తున్నారు. కాగా, ధోని.. 2019 ఐపీఎల్లో చివరిసారిగా చెన్నైలో ఆడాడు. గతేడాది ఐపీఎల్ యూఏఈలో జరగగా.. ఈ ఏడాది తొలి అంచె పోటీలు భారత్లో జరిగినా కరోనా కేసుల కారణంగా తమిళనాడు ప్రభుత్వం అనుమతించలేదు. ఇదిలా ఉంటే, వచ్చే సీజన్ కోసం జరుగబోయే మెగా వేలానికి ముందు ధోని సహా రవీంద్ర జడేజా, రుతురాజ్ గైక్వాడ్లను సీఎస్కే జట్టు రిటైన్ చేసుకోనున్నట్లు వార్తలు ప్రచారంలో ఉన్నాయి.
చదవండి: పాక్తో పోరుకు ముందు అగ్రశ్రేణి జట్లను ఢీకొట్టనున్న కోహ్లి సేన.. షెడ్యూల్ ఇదే
మరిన్ని వార్తలు