టీ20 ప్రపంచకప్ 2026లో ఇవాళ (ఫిబ్రవరి 11) ఓ చరిత్రాత్మక ఘట్టం చోటు చేసుకుంది. ప్రపంచకప్ చరిత్రలోనే తొలిసారి ఓ మ్యాచ్ డబుల్ సూపర్ ఓవర్ వరకు వెళ్లింది. ఈ మ్యాచ్లో గెలుపు కోసం సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ కొదమ సింహాల్లా పోరాడాయి.
రెగ్యులర్ మ్యాచ్లో ఇరు జట్ల స్కోర్లు సమం కావడంతో సూపర్ ఓవర్కు దారి తీసింది. సూపర్ ఓవర్లోనూ స్కోర్లు సమం కావడంతో రెండో సూపర్ ఓవర్ అనివార్యమైంది. ఇక్కడ కూడా గెలుపు కోసం ఇరు జట్లు చివరి బంతి వరకు వేచి చూశాయి.
అంతిమంగా సౌతాఫ్రికా చివరి బంతికి (రెండో సూపర్ ఓవర్) గెలుపు ఖరారు చేసుకొని విజేతగా నిలిచింది. ఒకవేళ ఈ సూపర్ ఓవర్లో కూడా స్కోర్లు సమమై ఉంటే, మ్యాచ్ మూడో సూపర్కు కూడా వెళ్లేది.
అంతర్జాతీయ టీ20 క్రికెట్లో సూపర్ ఓవర్ను 2008లో పరిచయం చేశారు. అప్పటివరకు స్కోర్లు సమమైన సందర్భాల్లో బౌల్ ఔట్ పద్దతి అమల్లో ఉండేది. సూపర్ ఓవర్ రాకతో బౌల్ ఔట్ పద్దతికి చరమగీతం పాడారు.
అప్పటి నుంచి రెగ్యులర్ మ్యాచ్ల్లో స్కోర్లు సమమైన సందర్భంలో గెలుపును నిర్దేశించేందుకు సూపర్ ఓవర్ను ఉపయోగిస్తున్నారు. ఈ సూపర్ ఓవర్లో ఒక్కో జట్టుకు ఒక్కో ఓవర్ ఆడేందుకు అవకాశం ఉంటుంది. బౌలర్ ఒక్కడే అయినా, ముగ్గురు బ్యాటర్లకు అవకాశం ఉంటుంది.
ఇద్దరు ఔటైతే, బంతులు మిగిలున్నా సంబంధిత టీమ్ ఆలౌట్గా పరిగణించబడుతుంది. సూపర్ ఓవర్లో ఏ జట్టు అయితే ఎక్కువ పరుగులు చేస్తుందో ఆ జట్టే విజేతగా నిర్దారించబడుతుంది.
సూపర్ ఓవర్లో కూడా స్కోర్లు సమమైతే రెండో సూపర్ ఓవర్ జరుగుతుంది. రెండో సూపర్ ఓవర్లోనూ సేమ్ రూల్స్తో ఇరు జట్లకు ఓ ఓవర్ అవకాశం ఉంటుంది. ఇక్కడ కూడా స్కోర్లు సమమైతే మూడో సూపర్ ఓవర్కు కూడా ఆస్కారముంటుంది.
ఒకవేళ మూడో సూపర్ ఓవర్లో కూడా స్కోర్లు సమమైతే టోర్నమెంట్ పరిస్థితులు, షెడ్యూల్ ఆధారంగా బౌండరీ కౌంట్ రూల్ (ఎక్కువ బౌండరీలు కొట్టిన జట్టు) లేదా బౌలింగ్ కౌంట్ రూల్ (తక్కువ వికెట్లు కోల్పోయిన జట్టు) ద్వారా విజేతలను నిర్ణయిస్తారు.
అంతర్జాతీయ టీ20 క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు మూడే మూడు సందర్భాల్లో డబుల్ సూపర్ ఓవర్ జరిగింది. ఇందులో ఓ మ్యాచ్ ట్రిపుల్ సూపర్ ఓవర్ వరకు కూడా వెళ్లింది.
2025 జూన్ 16న నేపాల్, నెదర్లాండ్స్ మధ్య జరిగిన మ్యాచ్ ట్రిపుల్ సూపర్ ఓవర్ వరకు వెళ్లింది. ఈ మ్యాచ్లో ఇరు జట్లు మూడో సూపర్ వరకు ఓటమిని ఒప్పు కోలేదు. అంతిమంగా నెదర్లాండ్స్ విజేతగా నిలిచింది. ఈ మ్యాచ్ యావత్ పొట్టి క్రికెట్ చరిత్రలో తొలి ట్రిపుల్ సూపర్ ఓవర్ మ్యాచ్గా చరిత్రకెక్కింది.
అంతర్జాతీయ టీ20ల్లో తొలి డబుల్ సూపర్ ఓవర్ మ్యాచ్ 2024 జనవరి 17న జరిగింది. ఈ మ్యాచ్లో భారత్, ఆఫ్ఘనిస్తాన్ గెలుపు కోసం నువ్వా-నేనా అన్నట్లు పోరాడాయి. అంతిమంగా టీమిండియానే విజేతగా నిలిచింది.
అంతర్జాతీయ టీ20ల్లో రెండో డబుల్ సూపర్ ఓవర్ మ్యాచ్ 2026 ఫిబ్రవరి 11న సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరిగింది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్లో సౌతాఫ్రికా రెండో సూపర్ ఓవర్ చివరి బంతికి గెలుపొందింది. టీ20 ప్రపంచకప్-2026లో భాగంగా ఈ మ్యాచ్ జరిగింది. టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఇదే తొలి డబుల్ సూపర్ ఓవర్ మ్యాచ్గా రికార్డుల్లోకెక్కింది.
అంతర్జాతీయ టీ20ల్లో కాకుండా మరో మ్యాచ్ కూడా డబుల్ సూపర్ ఓవర్ వరకు వెళ్లింది. అది ఐపీఎల్ 2020లో భాగంగా జరిగింది. ఆ ఎడిషన్లో అక్టోబర్ 18న జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్, కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ గెలుపు కోసం రెండో సూపర్ ఓవర్ వరకు పోరాడాయి. ఈ మ్యాచ్లో పంజాబ్ అంతిమ విజేతగా నిలిచింది. టీ20 క్రికెట్ చరిత్రలో ఇదే తొలి డబుల్ సూపర్ ఓవర్ మ్యాచ్గా నిలిచింది.
ఇవే కాకుండా మొత్తం టీ20 ఫార్మాట్లో చాలా సూపర్ ఓవర్ మ్యాచ్లు జరిగాయి. ప్రత్యేకించి ప్రపంచకప్ను తీసుకుంటే, ఈ మెగా టోర్నీలో ఇప్పటివరకు 4 సూపర్ ఓవర్ మ్యాచ్లు జరిగాయి. 2012 ఎడిషన్లో న్యూజిలాండ్-వెస్టిండీస్.. అదే ఎడిషన్లో న్యూజిలాండ్-శ్రీలంక.. 2024 ఎడిషన్లో నమీబియా-ఒమన్.. అదే ఎడిషన్లో పాకిస్తాన్-యూఎస్ఏ మ్యాచ్లు సూపర్ ఓవర్ వరకు వెళ్లాయి.


