ఐపీఎల్-2026లో దుమ్ములేపిన టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్కు తన సొంత గడ్డపై ఊహించని షాక్ తగిలింది. కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మక 'మహారాజా ట్రోఫి టీ20 లీగ్' వేలంలో రాహుల్ను కొనుగోలు చేయడానికి ఏ ఫ్రాంచైజీ కూడా ఆసక్తి చూపించలేదు.
రూ.2 లక్షల బేస్ ప్రైస్తో వేలంలోకి వచ్చిన రాహుల్, చివరికి అన్సోల్డ్గా మిగిలిపోయాడు. అద్భుతమైన ఫామ్లో ఉన్నప్పటికి రాహుల్ను ఏ జట్టు తీసుకోకపోవడానికి ప్రధాన కారణం అతడి అందుబాటుపై స్పష్టత లేకపోవడమేనని తెలుస్తోంది. జూన్ నెలలో భారత జట్టు అంతర్జాతీయ మ్యాచ్లతో బిజీగా ఉండనుంది.
జూన్ 6 నుంచి అఫ్గానిస్తాన్తో జరగబోయే ఏకైక టెస్ట్ మ్యాచ్కు రాహుల్ వైస్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. ఆ తర్వాత జూన్ 13 నుంచి జరగనున్న వన్డే సిరీస్లోనూ అతడు భాగం కానున్నాడు. అంతేకాకుండా జూలై రెండో వారంలో మూడు వన్డేల సిరీస్ కోసం ఇంగ్లండ్ పర్యటనకు కూడా రాహుల్ వెళ్లనున్నాడు.
రాహుల్ జాతీయ జట్టు బాధ్యతల కారణంగా ఈ లీగ్లో పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండే అవకాశం లేదు. ఈ టోర్నీలో మ్యాచ్లు మొత్తం హుబ్లీ, మైసూర్, బెంగళూరు నగరాల్లో జరగనున్నాయి.
చదవండి: 25 పరుగులకే ఆలౌట్.. 5 బంతుల్లో మ్యాచ్ ఫినిష్


