IPL 2025: పంత్‌ ఒక్కడే కాదు.. ఆ ముగ్గురూ కెప్టెన్‌ ఆప్షన్లు: సంజీవ్‌ గోయెంకా | It Has Been Decided: Sanjiv Goenka on Whether Pant or Pooran Will Captain LSG | Sakshi
Sakshi News home page

పంత్‌ కాదా?: లక్నో కెప్టెన్‌గా అతడే.. సంజీవ్‌ గోయెంకా కామెంట్స్‌ వైరల్‌

Dec 2 2024 1:02 PM | Updated on Dec 2 2024 3:07 PM

It Has Been Decided: Sanjiv Goenka on Whether Pant or Pooran Will Captain LSG

పంత్‌- గోయెంకా(PC: BCCI)

ఐపీఎల్‌-2025లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ కెప్టెన్‌ ఎవరు?!.. ఇంకెవరు రిషభ్‌ పంత్‌ అంటారా?!.. ఆగండాగండి.. ఇప్పుడే అలా డిసైడ్‌ చేసేయకండి.. ఈ మాట అంటున్నది స్వయానా లక్నో ఫ్రాంఛైజీ యజమాని, వ్యాపారవేత్త సంజీవ్‌ గోయెంకా. తమ జట్టు కెప్టెన్‌ ఎవరన్న అంశంపై ఆయన చేసిన కామెంట్స్‌ వైరల్‌ అవుతున్నాయి.

రూ. 27 కోట్లకు కొనుగోలు
కాగా మెగా వేలానికి ముందు లక్నో.. వెస్టిండీస్‌ స్టార్‌ నికోలసన్‌ పూరన్‌ కోసం ఏకంగా రూ. 21 కోట్లు ఖర్చుచేసిన విషయం తెలిసిందే. ఈ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ను తమ జట్టులోనే కొనసాగిస్తూ ఈ మేర భారీ మొత్తం చెల్లించింది. అయితే, వేలంలో అనూహ్య రీతిలో టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ రిషభ్‌ పంత్‌ను రికార్డు స్థాయిలో రూ. 27 కోట్లకు కొనుగోలు చేసింది.

ఢిల్లీ క్యాపిటల్స్‌తో పోటీ నేపథ్యంలో పంత్‌ ధర రూ. 20 కోట్లకు చేరగా.. లక్నో ఒక్కసారిగా ఏడు కోట్లు పెంచింది. దీంతో ఢిల్లీ రేసు నుంచి తప్పుకోగా.. వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ పంత్‌ను లక్నో దక్కించుకుంది. ఈ నేపథ్యంలో లక్నో జట్టు కొత్త కెప్టెన్‌గా పంత్‌ నియామకం లాంఛనమేనని క్రికెట్‌ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఈ క్రమంలో టీమిండియా మాజీ ఓపెనర్‌, కామెంటేటర్‌ ఆకాశ్‌ చోప్రాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో లక్నో ఓనర్‌ సంజీవ్‌ గోయెంకా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లక్నో జట్టు కొత్త కెప్టెన్‌ రిషభేనా లేదంటే మాకోసం ఏదైనా సర్‌ప్రైజ్‌ ప్లాన్‌ చేశారా? అని చోప్రా ప్రశ్నించాడు.

నలుగురు ఉన్నారు
ఇందుకు బదులిస్తూ.. ‘‘అవును.. కచ్చితంగా అందరూ ఆశ్చర్యానికి లోనవుతారు. నా వరకైతే సర్‌ప్రైజ్‌లు ఇవ్వడం ఇష్టం ఉండదు. అయితే, మా కెప్టెన్‌ ఎవరన్నది త్వరలోనే తెలియజేస్తాం. 

మా జట్టులో రిషభ్‌, పూరన్‌, మార్క్రమ్‌, మిచెల్‌ మార్ష్‌ రూపంలో నలుగురు నాయకులు అందుబాటులో ఉన్నారు’’ అని సంజీవ్‌ గోయెంకా పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలను బట్టి.. నికోలస్‌ పూరన్‌కు లక్నో పగ్గాలు అప్పగించే యోచనలో యాజమాన్యం ఉందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

వారే డిసైడ్‌ చేస్తారు
ఇక పంత్‌ ఓపెనర్‌గా వస్తాడా అన్న ప్రశ్నకు గోయెంకా సమాధానమిస్తూ.. ‘‘మా మిడిలార్డర్‌ను పటిష్టం చేసుకోవాలని భావిస్తున్నాం. వేలంలో బట్లర్‌(గుజరాత్‌ రూ, 15.75 కోట్లు) కోసం ప్రయత్నించాం. కానీ డబ్బు సరిపోలేదు. ఓపెనింగ్‌ జోడీపై జహీర్‌ ఖాన్‌, జస్టిన్‌ లాంగర్‌, మా కెప్టెన్‌ నిర్ణయం తీసుకుంటారు’’ అని పేర్కొన్నారు.

కాగా 2022లో క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో ఎంట్రీ ఇచ్చిన లక్నో ఫ్రాంఛైజీకి మూడు సీజన్లపాటు కేఎల్‌ రాహుల్‌ సారథ్యం వహించాడు. తొలి రెండు ఎడిషన్లలో జట్టును ప్లే ఆఫ్స్‌ చేర్చి సత్తా చాటాడు. అయితే, ఈ ఏడాది మాత్రం టాప్‌-4లో నిలపలేకపోయాడు. ఈ క్రమంలో రిటెన్షన్‌కు ముందు లక్నో రాహుల్‌ను వదిలేయగా.. వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్‌ రూ. 14 కోట్లకు కొనుక్కుంది.

చదవండి: IPL 2025: అతడే గనుక బతికి ఉంటే.. పంత్‌ రికార్డు బ్రేక్‌ చేసేవాడు!

Advertisement
 
Advertisement
Advertisement