
కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్కు ఒకే నెలలో వరుసగా రెండు చేదు అనుభవాలు ఎదురయ్యాయి. జూన్ 3న అతని సారథ్యంలోని పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ 2025 ఫైనల్లో ఆర్సీబీ చేతిలో పరాజయం పాలైంది. పది రోజులు తిరక్కుండానే జూన్ 12న అతని కెప్టెన్సీలోని మరో జట్టు ఫైనల్లో ఓటమిని ఎదుర్కొంది.
నిన్న జరిగిన ముంబై టీ20 లీగ్ ఫైనల్లో శ్రేయస్ నేతృత్వం వహించిన సోబో ముంబై ఫాల్కన్స్.. ముంబై సౌత్ సెంట్రల్ మరాఠా రాయల్స్ చేతిలో 5 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రేయస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేయగా.. ప్రత్యర్ధి టీమ్ మరో నాలుగు బంతులు మిగిలుండగానే 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
ఈ మ్యాచ్లో శ్రేయస్ ఆటగాడిగానూ విఫలమయ్యాడు. 17 బంతులు ఆడి బౌండరీలు, సిక్సర్లు లేకుండా 12 పరుగులు మాత్రమే చేశాడు. అతని జట్టులో మయూరేశ్ తండేల్ (50) అజేయ అర్ద సెంచరీతో రాణించగా.. హర్ష్ గర్వ్ (28 బంతుల్లో 45 నాటౌట్; ఫోర్, 4 సిక్సర్లు) ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.
అంగ్క్రిష్ రఘువంశీ 7, ఇషాన్ ముల్చందని 20, అమోఘ్ భత్కల్ 16 పరుగులు చేశారు. రాయల్స్ బౌలర్లలో వైభవ్ మాలీ 2, ఆదిత్య ధుమాల్, మ్యాక్స్వెల్ స్వామినాథన్ తలో వికెట్ పడగొట్టారు.
రాయల్స్ ఇన్నింగ్స్లో చిన్మయ్ రాజేశ్ సుతార్ (53) అర్ద సెంచరీతో రాణించగా.. అవైస్ ఖాన్ నౌషద్ 38, సాహిల్ భగవంతా జాదవ్ 22, సిద్దేశ్ లాడ్ 15, సచిన్ యాదవ్ 19, రోహన్ రాజే 8 (నాటౌట్) పరుగులు చేశారు. శ్రేయస్ జట్టు బౌలర్లలో కార్తీక్ మిశ్రా, యశ్ దిచోల్కర్ తలో రెండు వికెట్లు తీశారు. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా చిన్మయ్ రాజేశ్ సుతార్ ఎంపిక కాగా.. ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డును సాయిరాజ్ పాటిల్ గెలుచుకున్నాడు.
కెప్టెన్గా శ్రేయస్ రికార్డు
ఐపీఎల్ 2024లో కేకేఆర్ను విజేతగా నిలిపాడు
2024లో ముంబైకి సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ అందించాడు
ఐపీఎల్ 2019లో ఢిల్లీ క్యాపిటల్స్ను ఫైనల్స్కు చేర్చాడు (రన్నరప్)
ఐపీఎల్ 2024లో పంజాబ్ కింగ్స్ను ఫైనల్స్కు చేర్చాడు (రన్నరప్)
ముంబై టీ20 లీగ్ 2025లో సోబో ముంబై ఫాల్కన్స్ను ఫైనల్స్కు చేర్చాడు (రన్నరప్)