
Photo Courtesy: BCCI
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ తొలి విజయం నమోదు చేసింది. సీఎస్కేపై గెలుపుతో రాయల్స్ ఖాతాను ఓపెన్ చేసింది. సొంత మైదానంలో నిన్న (మార్చి 30) జరిగిన మ్యాచ్లో రాయల్స్ 6 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసి 182 పరుగులు చేసిన ఆ జట్టు.. ఆతర్వాత లక్ష్యాన్ని విజయవంతంగా కాపాడుకుంది.
ఈ మ్యాచ్లో రాయల్స్కు లభించిన మెరుపు ఆరంభాన్ని బట్టి చూస్తే ఇంకా భారీ స్కోర్ చేసుండాలి. కానీ సీఎస్కే బౌలర్లు పరిస్థితులను అదుపులోకి తెచ్చుకున్నారు. నితీశ్ రాణా (36 బంతుల్లో 81; 10 ఫోర్లు, 5 సిక్సర్లు) పవర్ ప్లేలో ఆకాశమే హద్దుగా రెచ్చిపోయాడు. రాణా ఔటయ్యాక రాయల్స్ ఇన్నింగ్స్ ఢీలా పడింది.
శాంసన్ (16 బంతుల్లో 20; ఫోర్, సిక్స్), రియాన్ పరాగ్ (28 బంతుల్లో 37; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), హెట్మైర్ (16 బంతుల్లో 19; ఫోర్, సిక్స్) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. నూర్ అహ్మద్ (4-0-28-2), పతిరణ (4-0-28-2) మరోసారి అద్భుతమైన స్పెల్స్ వేశారు. ఖలీల్ అహ్మద్ (4-0-38-2) పర్వాలేదనిపించాడు. జడ్డూ, అశ్విన్ తలో వికెట్ తీశారు. ఓవర్టన్ (2-0-30-0), అశ్విన్ (4-0-46-1) ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు.
అనంతరం ఛేదనకు దిగిన సీఎస్కేకు ఆదిలోనే షాక్ తగిలింది. ఇన్ ఫామ్ బ్యాటర్ రచిన్ రవీంద్రను జోఫ్రా ఆర్చర్ డకౌట్ చేశాడు. అనంతరం రుతురాజ్ (44 బంతుల్లో 63; 7 ఫోర్లు, సిక్స్) పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. అయితే అతనికి మరో ఎండ్ నుంచి ఎలాంటి సహకారం లభించలేదు. హసరంగ (4-0-35-4) తన స్పెల్ ప్రతి ఓవర్లో వికెట్ తీసి సీఎస్కేను ఇరకాటంలో పడేశాడు.
అయినా సీఎస్కేకు గెలుపు అవకాశాలు ఉండేవి. చివరి 3 ఓవర్లలో 45 పరుగులు చేయాల్సి ఉండింది. ధోని, జడ్డూ భారీ షాట్లు ఆడిన సీఎస్కే లక్ష్యానికి 7 పరుగుల దూరంలో నిలిచిపోయింది. చివరి ఓవర్లో 20 పరుగులు కాపాడుకోవాల్సిన తరుణంలో ఆర్చర్కు (3-1-13-1) బౌలింగ్ ఇవ్వకుండా సందీప్ శర్మకు బంతినప్పగించి రియాన్ పెద్ద సాహసమే చేశాడు. ఇది వర్కౌటైంది. సందీప్ 13 పరుగులు మాత్రమే ఇవ్వడంతో రాయల్స్ ఊపిరిపీల్చుకుంది.
మ్యాచ్ అనంతరం రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ మాట్లాడుతూ ఇలా అన్నాడు. సమయం తీసుకున్నా ఈ గెలుపు ఆనందానిచ్చింది. తొలి రెండు మ్యాచ్లు కఠినంగా సాగాయి. 20 పరుగులు తక్కువ చేశామని భావించాము. మిడిల్ ఓవర్లలో బాగానే ఆడినప్పటికీ.. వికెట్లు కోల్పోవడంతో భారీ స్కోర్ చేయలేకపోయాము.
మా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. వారు మా ప్రణాళికలను విజయవంతంగా అమలు చేశారు. తొలి మ్యాచ్లో 287 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించలేకపోయాము. రెండో మ్యాచ్లో 151 పరుగల టార్గెట్ను కాపాడుకోలేకపోయాము. అదృష్టవశాత్తు ఈ రోజు ఆటలో మాకు కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి.
నితీశ్తో పాటు నేను కూడా బాగానే ఆడానుకుంటున్నాను. చివరి ఓవర్ను ఆర్చర్కు కాకుండా సందీప్ శర్మకు ఇవ్వడంపై స్పందిస్తూ.. కెప్టెన్గా నాకు అనిపించి చేశాను. బ్యాటింగ్లో తక్కువ చేశామని భావిస్తున్న 20 పరుగులను ఫీల్డింగ్లో కవర్ చేశాము. ఫీల్డింగ్ కోచ్ దిశాంత్ యాగ్నిక్తో కలిసి చాలా వర్కౌట్ చేశాము. ఫలితం వచ్చింది.