2026 టీ20 వరల్డ్ చాంపియన్గా నిలిచిన తర్వాత భారత్ తమ తర్వాతి సిరీస్కు సమాయత్తమవుతోంది. ఐర్లాండ్, ఇంగ్లండ్లలో జరిగే సిరీస్లలో తలపడే భారత జట్లను నేడు సెలక్షన్ కమిటీ ప్రకటించనుంది. జూన్ 26న ప్రారంభమయ్యే ఈ టూర్లో భాగంగా ముందుగా ఐర్లాండ్తో 2 టి20లు జరుగుతాయి.
ఆ తర్వాత ఇంగ్లండ్తో 5 టి20లు, 3 వన్డేలు ఉంటాయి. వీటితో పాటు సెప్టెంబర్–అక్టోబర్లలో జపాన్లో జరిగే ఆసియా క్రీడల్లో పాల్గొనే టీమ్ను కూడా అజిత్ అగార్కర్ నాయకత్వంలోని కమిటీ ఎంపిక చేస్తుంది.
సూర్యకుమార్పై వేటు తప్పదా!
రెండు ఫార్మాట్లలో రెగ్యులర్ సభ్యుల ఎంపికను మినహాయిస్తే రెండు అంశాలపై ప్రధానంగా చర్చ జరుగుతోంది. టి20 కెపె్టన్సీ నుంచి సూర్యకుమార్ యాదవ్ను తొలగించడం ఖాయమైపోయింది. అతని సారథ్యంలో వరల్డ్ కప్ గెలుచుకున్న వెంటనే ఇది చోటు చేసుకోనుండటం గమనార్హం.
2025లో ఐసీసీ టోర్నీ చాంపియన్స్ ట్రోఫీ గెలుచుకొని ఫైనల్లో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచిన తర్వాత కూడా రోహిత్ శర్మ తన కెపె్టన్సీని కోల్పోయాడు. సూర్య విషయంలో కూడా అదే జరుగుతోంది. అయితే రోహిత్ ఆటగాడిగా తన స్థానాన్ని నిలబెట్టుకోగలిగాడు. కానీ సూర్య టీమ్లో కూడా చోటు కోల్పోనున్నాడు.
వరల్డ్ కప్ నెగ్గినా సుదీర్ఘ కాలంగా అతని ఫామ్ పేలవంగా ఉంది. వరల్డ్ కప్లో 9 ఇన్నింగ్స్లలో కలిపి 242 పరుగులే చేసిన సూర్య... ఐపీఎల్లోనూ దానిని కొనసాగిస్తూ 13 ఇన్నింగ్స్లలో 270 పరుగులే చేయగలిగాడు. 2028 టీ20 వరల్డ్ కప్, అదే ఏడాది జరిగే లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్ను దృష్టిలో ఉంచుకొని టి20 టీమ్ను సిద్ధం చేస్తున్న సెలక్టర్లు 36 ఏళ్ల సూర్యకు మరో అవకాశం ఇచ్చేందుకు సిద్ధంగా లేరు.
సూర్య స్థానంలో మరో ముంబైకర్ శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టడంతో పాటు బ్యాటింగ్ ఆర్డర్లో అతని నాలుగో స్థానాన్ని కూడా భర్తీ చేయనున్నాడు. శ్రేయస్ 2023 డిసెంబర్లో భారత్ తరఫున చివరిసారిగా టి20 ఆడినా...ఐపీఎల్లో తన బ్యాటింగ్తో పాటు కెప్టెన్సీతో ఆకట్టుకున్నాడు. మూడు వేర్వేరు ఫ్రాంచైజీలను ఐపీఎల్ ఫైనల్కు చేర్చిన అతని నాయకత్వంలో 2024లో కోల్కతా విజేతగా నిలవగా... 2020, 2025లో ఢిల్లీ, పంజాబ్కు రన్నరప్గా నిలిచాయి.
లాంఛనమేనా!
మరోవైపు 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ భారత జట్టులోకి రావడం లాంఛనమే కావచ్చు. అసాధారణ ఆటతో అందరి దృష్టినీ తన వైపునకు తిప్పుకున్న వైభవ్ను ఎంపిక చేసేందుకు ఇదే సరైన సమయంగా భావిస్తున్నారు. ఐపీఎల్లో ఏకంగా 237.30 సగటుతో అతను 776 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలిచాడు.
అయితే భారత టీ20 జట్టు టాప్–3 అభిషేక్ శర్మ, సంజూ సామ్సన్, ఇషాన్ కిషన్లతో పటిష్టంగా ఉంది. ఈ నేపథ్యంలో వైభవ్ను ఆడించడం కష్టంగా అనిపిస్తున్నా... ఆసియా క్రీడలకు మాత్రం అతను ఎంపిక కావడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి.


