ర‌ద్దైన టెస్ట్‌ మ్యాచ్ అప్పుడే.. క్లారిటీ ఇచ్చిన ఇరు బోర్డులు.. అయితే..? | India And England Set To Play Abandoned Manchester Test Match In 2022 | Sakshi
Sakshi News home page

IND Vs ENG: ర‌ద్దైన టెస్ట్‌ మ్యాచ్ అప్పుడే.. క్లారిటీ ఇచ్చిన ఇరు బోర్డులు.. అయితే..?

Sep 25 2021 6:49 PM | Updated on Sep 25 2021 10:22 PM

India And England Set To Play Abandoned Manchester Test Match In 2022 - Sakshi

ముంబై: భారత్‌-ఇంగ్లండ్‌ జట్ల మ‌ధ్య మాంచెస్టర్‌ వేదికగా సెప్టెంబర్‌ 10న జ‌ర‌గాల్సిన చివరి టెస్ట్ మ్యాచ్‌ నాటకీయ పరిణామాల మధ్య షెడ్యూల్‌ సమయానికి మూడు గంటల ముందు ర‌ద్దైన సంగతి తెలిసిందే. అయితే రద్దైన ఆ మ్యాచ్‌ను రీషెడ్యూల్ చేసేందుకు తాజాగా ఇరు దేశాల క్రికెట్‌ బోర్డులు అంగీకారం తెలిపాయి. వచ్చే ఏడాది జులైలో జరిగే ఇంగ్లండ్‌ పర్యటనలో పరిమిత ఓవర్ల సిరీస్‌తో పాటు ఈ మ్యాచ్‌ నిర్వహించేందుకు బీసీసీఐ, ఈసీబీలు పరస్పర అంగీకారానికి వచ్చాయి​. అయితే, రీ షెడ్యూల్‌ అయ్యే ఆ మ్యాచ్‌తో ఈ సిరీస్‌కు సంబంధం ఉంటుందా లేదా అన్న విషయంపై మాత్రం ఇరు దేశాల క్రికెట్‌ బోర్డులు నోరుమెదపలేదు. 

రీ షెడ్యూల్‌ మ్యాచ్‌ 5 టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగానే జరగాలని ఈసీబీ పట్టుబడుతుంటే.. బీసీసీఐ మాత్రం అది స్టాండ్‌ అలోన్‌ మ్యాచ్‌(సెపరేట్‌ మ్యాచ్‌) అవుతుందని సూచన ప్రాయంగా పేర్కొంది. 4 టెస్ట్‌లు ముగిసే సమయానికి టీమిండియా 2-1 ఆధిక్యంలో ఉన్న నేపథ్యంలో సిరీస్‌ ఫలితం ఎటూ తేలలేదు. ఈ విషయమై ఐసీసీ సైతం ఎలాంటి ప్రకటన చేయలేదు. 

ఇదిలా ఉంటే, నాలుగో టెస్ట్‌కు ముందు తొలుత టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రికి కరోనా సోకగా.. అతని నుంచి బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్‌, ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్‌, ఫిజియో నితిన్ పటేల్‌లకు వైరస్ సోకింది. అనంతరం ఐదో టెస్టుకు ముందు రోజు గురువారం (సెప్టెంబర్ 9) సాయంత్రం టీమిండియా జూనియర్ ఫిజియో యోగేశ్ పర్మార్‌‌‌‌కు కూడా కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ నేపథ్యంలో టీమిండియా ఆటగాళ్లందరికీ ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు చేయగా.. అందరికీ నెగెటివ్‌ వచ్చింది. అయినప్పటికీ భారత జట్టు ముందు జాగ్రత్త చర్యగా చివరి టెస్ట్‌లో ఆడలేమంటూ చేతులెత్తేసింది. 
చదవండి: అతన్ని వదులుకోవడం కేకేఆర్‌ చేసిన అతి పెద్ద తప్పిదం..

Advertisement
 
Advertisement
Advertisement