Ind Vs Sl 1st T20: బుమ్రాను ఆడించడం ఏమిటి.. నిజంగా ఆశ్చర్యపోయా.. వాళ్ల సంగతి ఏంటి: టీమిండియా మాజీ బౌలర్‌

Ind Vs Sl: Ashish Nehra Surprised Over Jasprit Bumrah Playing T20 Series - Sakshi

India Vs Sri Lanka T20 Series: శ్రీలంకతో టీ20 సిరీస్‌లో టీమిండియా ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రాను ఆడించడం పట్ల భారత మాజీ ఫాస్ట్‌బౌలర్‌ ఆశిష్‌ నెహ్రా ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. టీ20 ప్రపంచకప్‌-2022 సమీపిస్తున్న తరుణంలో ప్రయోగాలు చేయాల్సి ఉందని, మిగతా ఆప్షన్లు కూడా పరిశీలించాలని అభిప్రాయపడ్డాడు. ఇక శ్రీలంకతో రెండు టెస్టులు ఆడాల్సి ఉన్న నేపథ్యంలో బుమ్రాకు విశ్రాంతినిచ్చి ఉంటే బాగుండేదని పేర్కొన్నాడు.

ఈ మేరకు నెహ్రా క్రిక్‌బజ్‌తో మాట్లాడుతూ... ‘‘శ్రీలంకతో టీ20 సిరీస్‌లో బుమ్రాను ఆడించడం నాకు ఆశ్చర్యం కలిగించింది. భారత జట్టులో చాలా మంది ఫాస్ట్‌ బౌలర్లు ఉన్నారు. వారికి మరిన్ని అవకాశాలు ఇవ్వాలి. భువనేశ్వర్‌ కుమార్‌, మహ్మద్‌ సిరాజ్‌ ఉన్నారు. ఇక ఆవేశ్‌ ఖాన్‌ కేవలం ఒకే ఒక్క మ్యాచ్‌ ఆడాడు. బుమ్రా జట్టులోకి వస్తే వీరిలో చాలా మంది బెంచ్‌కే పరిమితం కావాల్సి వస్తుంది.

మెగా టోర్నీకి సన్నద్ధమయ్యే క్రమంలో అన్ని ఆప్షన్లు పరిశీలించాల్సి ఉంటుంది’’ అని పేర్కొన్నాడు. ఇక స్టార్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా పునరాగమనం సంతోషం కలిగిచిందన్న నెహ్రా... ‘‘జడేజా జట్టులోకి తిరిగి రావడం సంతోషాన్నిచ్చింది. అన్ని ఫార్మాట్లలో అతడు మెరుగ్గా రాణించగలడు. బ్యాటింగ్‌ పరంగా ఎంతో మెరుగయ్యాడు.

ఏడు లేదంటే ఎనిమిదో స్థానంలో కాదు.. ఆరో స్థానంలో కూడా బ్యాటింగ్‌ చేయగల సత్తా అతడికి ఉంది’’ అని ప్రశంసలు కురిపించాడు. కాగా శ్రీలంకతో మొదటి టీ20లో భారత్‌ 62 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో బుమ్రా 3 ఓవర్లు బౌలింగ్‌ చేసి 19 పరుగులు ఇవ్వగా... జడేజా 4 ఓవర్లలో 28 పరుగులు ఇచ్చి ఒక వికెట్‌ పడగొట్టాడు. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి 3 పరుగులతో అజేయంగా నిలిచాడు.

చదవండి: Ravindra Jadeja: రీఎంట్రీ ఇచ్చాడు.. 'తగ్గేదేలే' అన్నాడు.. వీడియో వైరల్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top