న్యూజిలాండ్‌తో మూడో వన్డే.. టీమిండియా ఎలా ఉండబోతుందంటే..?

IND VS NZ 3rd ODI 2023: Team India Predicted Eleven - Sakshi

IND VS NZ 3rd ODI: స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరుగుతున్న 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే 2-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.. జనవరి 24న నామమాత్రంగా జరిగే మూడో వన్డేలో ప్రయోగాల బాట పట్టనుందా..? అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది. ఇండోర్‌ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో షాబాజ్‌ అహ్మద్‌, చహల్‌, ఉమ్రాన్‌ మాలిక్‌ తుది జట్టులో ఉండే అవకాశం ఉం‍ది. తొలి రెండు వన్డేలు ఆడిన కుల్దీప్‌ యాదవ్‌, వాషింగ్టన్‌ సుందర్‌, శార్దూల్‌ ఠాకూర్‌లకు విశ్రాంతినివ్వాలని మేనేజ్‌మెంట్‌ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈనెల 27 నుంచే ప్రారంభంకానున్న టీ20 సిరీస్‌ (న్యూజిలాండ్‌తో) నేపథ్యంలో చహల్‌, ఉమ్రాన్‌ మాలిక్‌లకు ఓ అవకాశం ఇవ్వాలన్నది మేనేజ్‌మెంట్‌ అభిప్రాయమని సమాచారం. చహల్‌, ఉమ్రాన్‌ మాలిక్‌ ఇద్దరూ టీ20 జట్టులో కూడా ఉండటంతో ఈ మార్పులు చేసే అవకాశం ఉందని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.

పైన పేర్కొన్న మూడు మార్పులు మినహాయించి, రెండో వన్డే ఆడిన జట్టునే యధాతథంగా కొనసాగించవచ్చు. ఓపెనర్లుగా రోహిత్‌, గిల్‌, వన్‌డౌన్‌లో విరాట్‌ కోహ్లి, ఆతర్వాత ఇషాన్‌ కిషన్‌, సూర్యకుమార్‌, హార్ధిక్‌, షాబాజ్‌ అహ్మద్‌, షమీ, సిరాజ్‌, ఉమ్రాన్‌, చహల్‌ తుది జట్టులో ఉండే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే, ఈ సిరీస్‌లో భారత్‌ తొలి వన్డేలో 12 పరుగుల తేడాతో, రెండో వన్డేలో 8 వికెట్ల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top