39 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన టీమిండియా టెయిలెండర్లు.. | Sakshi
Sakshi News home page

IND Vs ENG 2nd Test: 39 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన షమీ, బుమ్రా జోడి

Published Mon, Aug 16 2021 8:56 PM

IND Vs ENG 2nd Test: Shami, Bumrah Pair Breaks 39 Years Old Record - Sakshi

లండన్: భారత టెయిలండర్లు మహ‌మ్మద్ ష‌మీ(70 బంతుల్లో 56 నాటౌట్‌; 5 ఫోర్లు, సిక్స్‌), జస్ప్రీత్ బుమ్రా(64 బంతుల్లో 34 నాటౌట్‌; 3 ఫోర్లు) అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. ఇంగ్లండ్‌తో లార్డ్స్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో ఈ ఇద్దరు పేసర్లు చెలరేగి బ్యాటింగ్‌ చేశారు. 209 పరుగులకే ఎనిమిది వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకున్న భారత్‌ను అద్భుత పోరాట పటిమతో విన్నింగ్‌ ట్రాక్‌పై నిలబెట్టారు. వీరిద్దరూ తొమ్మిదో వికెట్‌కు అజేయమైన 89 పరుగులు జోడించి టీమిండియాను పటిష్ట స్థితికి చేర్చారు. 

ఈ క్రమంలో సుదీర్ఘ ఫార్మాట్‌లో ఇంగ్లండ్ గడ్డపై భారత్ తరఫున 9వ వికెట్‌కు అత్యధిక పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన జోడీగా చరిత్రకెక్కారు. 39 ఏళ్ల కిందట 1982లో ఇదే వేదికగా జరిగిన మ్యాచ్‌లో భారత దిగ్గజాలు కపిల్ దేవ్-మదన్ లాల్ 9వ వికెట్‌కు 66 పరుగులు జోడించారు. ఇప్పటివరకు ఇంగ్లండ్‌ గడ్డపై భారత్‌ తరఫున తొమ్మిదో వికెట్‌కు ఇదే అత్యుత్తమ భాగస్వామ్యంగా ఉండింది. 39 ఏళ్ల తర్వాత ఈ రికార్డును షమీ, బుమ్రా జోడి అధిగమించడం విశేషం.

ఇదిలా ఉంటే, టీమిండియా నిర్దేశించిన 272 లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లండ్‌ జట్టు కేవలం 67 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో చిక్కుకుంది. టీమిండియా పేసర్లు విశ్వరూపం ప్రదర్శించడంతో ఇంగ్లండ్‌ ఆటగాళ్లు బెంబేలెత్తిపోయారు. తొలి ఓవర్లోనే బుమ్రా ఓపెనర్‌ రోరి బర్న్స్ ను డకౌట్‌ చేయగా, రెండో ఓవర్‌లో షమీ మరో ఓపెనర్‌ సిబ్లీని డకౌట్‌గా పెవిలియన్‌కు పంపాడు. అనంతరం ఇషాంత్‌ హసీబ్‌ హమీద్‌(9), బెయిర్‌స్టో(2)ను పెవిలియన్‌కు పంపి ఇంగ్లండ్‌ను కోలుకోలేని దెబ్బ తీశాడు. ప్రస్తుతం కెప్టెన్‌ జో రూట్‌(33) క్రీజ్‌లో పాతుకుపోయాడు. ఇంగ్లండ్‌ గెలవాలంటే మరో 205 పరుగులు చేయాల్సి ఉండగా చేతిలో ఆరు వికెట్లు ఉన్నాయి.
చదవండి: షమీ, బుమ్రాలకు లభించిన ఘన స్వాగతం చూస్తే ఔరా అనాల్సిందే..!

Advertisement
Advertisement