అఫ్గానిస్తాన్తో వన్డే సిరీస్ ఆరంభానికి ముందు టీమిండియాకు విరాట్ కోహ్లి రూపంలో భారీ షాక్ తగిలింది. ఈ సిరీస్కు తొడ కండరాల గాయం కారణంగా కోహ్లి దూరమయ్యాడు. ఐపీఎల్-2026 ఫైనల్లో కూడా గాయంతో బాధపడుతూనే ఆడాడు.
అయితే గాయం తీవ్రత ఎక్కువ కావడంతో అఫ్గాన్ సిరీస్ నుంచి తప్పుకోవాలని విరాట్ నిర్ణయించుకున్నాడు. దీంతో కోహ్లి స్ధానాన్ని భర్తీ చేసే పనిలో బీసీసీఐ సెలక్షన్ కమిటీ పడింది.ఈ క్రమంలో విరాట్ స్ధానంలో జట్టులోకి వచ్చే అవకాశమున్న ఆటగాళ్లపై ఓ లుక్కేద్దాం.
తిలక్ వర్మ
హైదరాబాదీ తిలక్ వర్మ ప్రస్తుత రేసులో అందరికంటే ముందున్నాడు. టీ20 జట్టులో రెగ్యులర్ సభ్యునిగా కొనసాగుతున్న తిలక్ను.. ఇప్పుడు వన్డే జట్టులోకి తీసుకునే సూచనలు ఎక్కువగా కన్పిస్తున్నాయి. ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్కు మిడిలార్డర్లో రాణించే సత్తా ఉంది.
అతడు ఇప్పటివరకు భారత్ తరపున కేవలం 5 వన్డేలు మాత్రమే ఆడాడు. కాగా సెలక్టర్లు ఇటీవలే తిలక్ను శ్రీలంక టూర్ కోసం భారత-ఎ జట్టు కెప్టెన్ ఎంపిక చేశారు. ఒకవేళ తిలక్ను వన్డే జట్టులోకి తీసుకోవాలని భావిస్తే ఇండియా-ఎ టీమ్ కెప్టెన్గా మరొకరని నియమించే అవకాశముంది.
దేవదత్ పడిక్కల్
కర్ణాటక ఆటగాడు దేవదత్ పడిక్కల్ కూడా సెలక్టర్ల రాడార్లో ఉన్నట్లు తెలుస్తోంది. అఫ్గానిస్తాన్తో ఏకైక టెస్టుకు ఎంపిక చేసిన భారత జట్టులో పడిక్కల్ భాగంగా ఉన్నాడు. ఇప్పుడు వన్డే జట్టులోకి తీసుకున్న ఆశ్చర్యపోనక్కర్లేదు. పడిక్కల్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. ఐపీఎల్-2026లో ఆర్సీబీ తరపున పడిక్కల్ దుమ్ములేపాడు. టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సైతం తన ప్రత్యామ్నాయ జట్టులో పడిక్కల్ను నెం.3 స్థానానికి ఎంపిక చేయడం విశేషం.
రజత్ పాటిదార్
ఇక ఆర్సీబీకి వరుసగా రెండో టైటిల్ను అందించిన కెప్టెన్ పాటిదార్ను జట్టులోకి తీసుకోవడానికి ఇదొక మంచి అవకాశమని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నాడు. పాటిదార్ కూడా టాపర్డర్తో పాటు మిడిలార్డర్లో కూడా రాణించగలడు. అతడు మంచి ఫామ్లో కూడా ఉన్నాడు. వీరితో పాటు రుతురాజ్ గైక్వాడ్ రేసులో ఉన్నాడు. కానీ రుతురాజ్ భారత-ఎ జట్టు వైస్ కెప్టెన్గా ఎంపికయ్యాడు. వీరిలో ఎవరు వైపు సెలక్టర్లు మొగ్గు చూపుతారో వేచి చూడాలి.


