
వన్డే ప్రపంచకప్ ఆడాలన్న స్కాట్లాండ్ ఆశలు ఆవిరయ్యాయి. ఐసీసీ టోర్నీ బరిలో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో స్కాటిష్ జట్టు ఓటమిపాలైంది. కాగా ఈ ఏడాది సెప్టెంబర్ –అక్టోబర్లలో భారత్ వేదికగా మహిళల వన్డే వరల్డ్కప్ టోర్నీ (ICC Women's ODI World Cup) జరుగనున్న విషయం తెలిసిందే.
ఒక్క వికెట్ తేడాతో
ఈ నేపథ్యంలో పాకిస్తాన్ వేదికగా ఇందుకు సంబంధించి క్వాలిఫయర్ మ్యాచ్లు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం జరిగిన వరల్డ్కప్ క్వాలిఫయింగ్ టోర్నీ లీగ్ మ్యాచ్లో ఐర్లాండ్ ఒక్క వికెట్ తేడాతో స్కాట్లాండ్ (Ireland Beat Scotland)ను ఓడించింది.
ఒకవేళ ఈ మ్యాచ్లో స్కాట్లాండ్ గెలిచి... శనివారం పాకిస్తాన్తో జరిగే మ్యాచ్లో బంగ్లాదేశ్ ఓడిపోతే స్కాట్లాండ్ ప్రపంచకప్ టోర్నీకి అర్హత సాధించేది. కానీ స్కాట్లాండ్ ఆశలపై ఐర్లాండ్ నీళ్లు కుమ్మరించింది.
కేథరీన్ బ్రైస్ అజేయ సెంచరీ వృథా
లాహోర్ వేదికగా ఐర్లాండ్తో పోరులో ముందుగా బ్యాటింగ్కు దిగిన స్కాట్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 268 పరుగులు సాధించింది. కెప్టెన్ కేథరీన్ బ్రైస్ (Kathryn Bryce- 137 బంతుల్లో 131 నాటౌట్; 14 ఫోర్లు, 2 సిక్స్లు) అజేయ సెంచరీ చేసి స్కాట్లాండ్కు గౌరవప్రద స్కోరు అందించింది.
నరాలు తెగే ఉత్కంఠ.. ఆఖరికి..
అనంతరం ఐర్లాండ్ జట్టు సరిగ్గా 50 ఓవర్లు ఆడి 9 వికెట్లు కోల్పోయి 269 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. ఓపెనర్లు సారా ఫోర్బ్స్ (55; 6 ఫోర్లు), కెప్టెన్ గ్యాబీ లూయిస్ (61; 9 ఫోర్లు), లౌరా డెలానీ (57 నాటౌట్; 4 ఫోర్లు) అర్ధ సెంచరీలు చేసి ఐర్లాండ్ విజయంలో ముఖ్యపాత్ర పోషించారు.
ఆరు జట్లు పోటీపడుతున్న ఈ క్వాలిఫయింగ్ టోర్నీలో స్కాట్లాండ్, ఐర్లాండ్ తమ ఐదు లీగ్ మ్యాచ్లను పూర్తి చేసుకొని నాలుగు పాయింట్లతో వరుసగా మూడో, నాలుగో స్థానంలో నిలిచాయి.
పాక్ బెర్తు ఖరారు
ఇక చివరి రౌండ్ లీగ్ మ్యాచ్ల్లో బంగ్లాదేశ్ జట్టుతో పాకిస్తాన్.. థాయ్లాండ్ జట్టుతో వెస్టిండీస్ శనివారం తలపడతాయి. ఇదిలా ఉంటే.. హ్యాట్రిక్ విజయాలతో పాకిస్తాన్ ఇప్పటికే వరల్డ్కప్కు అర్హత పొందగా... రెండో బెర్త్ కోసం బంగ్లాదేశ్, వెస్టిండీస్ రేసులో ఉన్నాయి. బంగ్లాదేశ్ ఆరు పాయింట్లతో రెండో స్థానంలో ఉంది.
చదవండి: BCCI: ఫిక్సింగ్ యత్నం.. బీసీసీఐ ఆగ్రహం.. అతడిపై నిషేధం