
ఫిక్సింగ్కు యత్నించిన గుర్మీత్ సింగ్ భమ్రా అనే వ్యక్తిపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) నిషేధం విధించింది. భమ్రా ముంబై టీ20 లీగ్లో సొబో సూపర్ సానిక్స్ అనే ఫ్రాంచైజీ కలిగి ఉన్నాడు. ఐదేళ్ల క్రితం అతడు ఆ లీగ్లో ఫిక్సింగ్కు యత్నించినట్లు తేలడంతో బోర్డు అంబుడ్స్మన్ రిటైర్డ్ జస్టిస్ అరుణ్ మిశ్రా నిషేధం విధించారు.
అయితే, భమ్రాపై ఐదేళ్లా లేదంటే జీవితకాల నిషేధమా అనేది తెలియాల్సి ఉంది. కాగా 2019 సీజన్లో సొబో సూపర్ సానిక్స్ ప్లేయర్లు ధవళ్ కులకర్ణి, భవిన్ ఠక్కర్లతో ఫిక్సింగ్ కోసం సంప్రదింపులు జరిపారు. టీమిండియాకు ప్రాతినిధ్యం వహించిన కులకర్ణి సహా ఠక్కర్లు ఫిక్సింగ్కు నిరాకరించారు. తదనంతరం ఈ విషయాన్ని బోర్డు అవినీతి నిరోధక విభాగం (ఏసీయూ)కు తెలిపారు.
సోనూ వాసన్ అనే వ్యక్తి ద్వారా గుర్మీత్ సింగ్ ఫిక్సింగ్ ప్రయత్నాలు చేశారు. సోనూ వాసన్ డబ్బు ఆశ చూపినా భవిన్ తలొగ్గలేదు. ఇద్దరు ఫిక్సింగ్కు ససేమిరా అనడంతో వారి ప్రయత్నాలు విఫలమయ్యాయి. విచారణలో గుర్మీత్ దోషి అని తేలడంతో శిక్ష ఖరారు చేశారు.
ఇక భమ్రా జీటీ20 కెనడా లీగ్ (ప్రస్తుతం మనుగడలో లేదు)లోనూ భాగమయ్యాడు. కాగా కోవిడ్కు ముందు అతడు ముంబై టీ20 లీగ్ ఫ్రాంఛైజీ ఓనర్గా ఉండగా.. ప్రస్తుతం అతడిని లీగ్ నుంచి తొలగించారు.
ఐపీఎల్లోనూ ఫిక్సింగ్ కలకలం
కాగా ఐపీఎల్-2025లోనూ ఫిక్సింగ్కు అవకాశముందంటూ ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన బీసీసీఐ జట్ల యజమానులు, ఆటగాళ్లు, సిబ్బందికి కీలక సూచనలు చేసింది.
హైదరాబాద్కు చెందిన ఓ వ్యాపారవేత్త గట్టిగానే ఫిక్సింగ్ యత్నాలు చేస్తున్నాడని.. ఆ వ్యక్తి గనుక సంప్రదిస్తే వెంటనే అవినీతి నిరోధక భద్రతా విభాగం దృష్టికి తీసుకురావాలని ఆదేశించింది. ప్లేయర్లతో పాటు వారి కుటుంబ సభ్యులకు ఖరీదైన బహుమతుల పేరిట వల వేసే అవకాశం ఉందని.. ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
సదరు వ్యాపారవేత్త గతంలోనూ ఇలాంటి అవినీతి కార్యకలాపాలకు పాల్పడ్డాడని.. అతడికి దూరంగా ఉండాలని హెచ్చరించింది. ఒకవేళ అతడు ఏ రకంగానైనా సంప్రదింపులు జరపాలని చూస్తే వెంటనే ఫిర్యాదు చేయాలని ఆటగాళ్లను అప్రమత్తం చేసింది.
చదవండి: సచిన్ రికార్డు బద్దలు కొట్టిన పాటిదార్.. ఐపీఎల్ చరిత్రలో భారత తొలి బ్యాటర్గా