టీ20 వరల్డ్‌కప్‌లో బోణీ కొట్టిన భారత్‌ | ICC Under 19 Women T20 World Cup 2025: India Beat West Indies By 9 Wickets | Sakshi
Sakshi News home page

టీ20 వరల్డ్‌కప్‌లో బోణీ కొట్టిన భారత్‌

Jan 19 2025 2:12 PM | Updated on Jan 19 2025 2:47 PM

ICC Under 19 Women T20 World Cup 2025: India Beat West Indies By 9 Wickets

అండర్‌-19 మహిళల టీ20 వరల్డ్‌కప్‌-2025లో భారత్‌ బోణీ కొట్టింది. కౌలాలంపూర్‌ వేదికగా వెస్టిండీస్‌తో ఇవాళ (జనవరి 19) జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన వెస్టిండీస్‌ను భారత బౌలర్లు 44 పరుగులకే (13.2 ఓవర్లలో) కుప్పకూల్చారు. 

పరుణిక సిసోడియా మూడు, ఆయుశి శుక్లా, జోషిత్‌ వీజే తలో రెండు వికెట్లు పడగొట్టారు. ముగ్గురు విండీస్‌ బ్యాటర్లు రనౌటయ్యారు. విండీస్‌ ఇన్నింగ్స్‌లో అసాబి ఖలందర్‌ (12), కేనిక కస్సార్‌ (15) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. ఏకంగా ఐదుగురు విండీస్‌ బ్యాటర్లు డకౌటయ్యారు.

45 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత్‌ 4.2 ఓవర్లలో వికెట్‌ మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఓపెనర్‌ గొంగడి త్రిష 4 పరుగులు చేసి ఔట్‌ కాగా.. జి కమలిని (16), సనికా ఛల్కే (18) భారత్‌ను విజయతీరాలకు చేర్చారు. విండీస్‌ బౌలర్‌ క్లాక్స్‌టన్‌కు త్రిష వికెట్‌ దక్కింది. కాగా, ప్రస్తుత వరల్డ్‌కప్‌లో భారత్‌.. శ్రీలంక, మలేసియా, వెస్టిండీస్‌తో కలిసి గ్రూప్‌-ఏలో పోటీ పడుతుంది.

గ్రూప్‌-ఏలో భాగంగా ఇవాళే మరో మ్యాచ్‌ జరిగింది. మలేసియాపై శ్రీలంక 139 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. లంక బ్యాటర్లలో దహామి సనేత్మ (55) అర్ద సెంచరీతో రాణించింది. 

163 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన మలేసియా 23 పరుగులకే ఆలౌటైంది. మలేసియా ఇన్నింగ్స్‌లో ఒక్కరు కూడా రెండంకెల స్కోర్‌ చేయలేకపోయారు. లంక బౌలర్లలో చమోది ప్రబోద (4-2-5-3) అత్యంత పొదుపుగా బౌలింగ్‌ చేయడంతో పాటు మూడు వికెట్లు తీసింది. 

ఈ టోర్నీలో భారత్‌ జనవరి 21న (మలేసియాతో) తమ తదుపరి మ్యాచ్‌ ఆడుతుంది. జనవరి 23న భారత్‌.. శ్రీలంకతో తమ చివరి గ్రూప్‌ స్టేజీ మ్యాచ్‌ ఆడుతుంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement