
ఐపీఎల్-2025 సీజన్లో ముంబై ఇండియన్స్ పోరాటం ముగిసింది. ఆదివారం పంజాబ్ కింగ్స్తో జరిగిన క్వాలిఫయర్-2లో 5 వికెట్ల తేడాతో ఓటమిపాలైన ముంబై ఇండియన్స్.. ఈ టోర్నీ నుంచి ఇంటిముఖం పట్టింది. తొలుత బ్యాటింగ్లో అదరగొట్టిన ముంబై, బౌలింగ్లో మాత్రం చేతులెత్తేసింది. ఆఖరికి ఆ జట్టు ప్రధాన బౌలర్ బుమ్రా సైతం తేలిపోయాడు. 204 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి పంజాబ్ కింగ్స్ 5 వికెట్లు కోల్పోయి 19 ఓవర్లలో చేధించింది.
పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. అయ్యర్ 41 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్స్లతో 87 పరుగులు చేసి తన జట్టును ఫైనల్కు చేర్చాడు. అతడితో పాటు జోష్ ఇంగ్లిష్(38), వధేరా(48) కీలక ఇన్నింగ్స్లు ఆడారు. ముంబై బౌలర్లలో అశ్వినీ కుమార్ రెండు, బౌల్ట్, హార్దిక్ పాండ్యా తలా వికెట్ సాధించారు.
బుమ్రా తన నాలుగు ఓవర్ల కోటాలో వికెట్ ఏమీ తీయకుండా ఏకంగా 40 పరుగులు సమర్పించుకున్నాడు. ఇక ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా స్పందించాడు. బ్యాటింగ్లో రాణించినా, బౌలింగ్లో విఫలమయ్యామని హార్దిక్ అన్నాడు.
"శ్రేయస్ అయ్యర్ ఆసాధరణ ప్రదర్శన కనబరిచాడు. అతడు ఆడిన షాట్లు అత్యద్భుతం. అయ్యర్తో పాటు మిగిలిన బ్యాటర్లు కూడా చాలా బాగా బ్యాటింగ్ చేశారు. మా ఇన్నింగ్స్ తర్వాత ఈ టార్గెట్ను డిఫెండ్ చేసుకోవచ్చు అని భావించామ. కానీ ఇటువంటి కీలక మ్యాచ్లలో బౌలింగ్ యూనిట్ కూడా సమిష్టిగా రాణించడం చాలా ముఖ్యం.
ఈ మ్యాచ్లో మా బౌలర్లు తమ ప్రణాళికలను సరిగ్గా అమలు చేయలేకపోయారు. పంజాబ్ బ్యాటర్లు చాలా ప్రశాంతంగా కన్పించారు. వారు తమ అద్బుత బ్యాటింగ్తో మమ్మల్ని ఒత్తిడిలోకి నెట్టారు. ఫస్ట్ ఇన్నింగ్స్కు సెకెండ్ ఇన్నింగ్స్కు పిచ్లో పెద్దగా మార్పులేదు. కొంచెం మంచు ప్రభావం ఉన్నప్పటకి దానిని మా ఓటమికి సాకుగా చెప్పాలనుకోవడం లేదు. కెప్టెన్గా నేను కూడా అంత వ్యూహాత్మకంగా వ్యవహరించలేకపోయాను.
సరైన లెంగ్త్లో బౌలింగ్ చేయడం, సరైన సమయంలో సరైన బౌలర్ను ఉపయోగించడం వంటివి చేసుంటే ఫలితం భిన్నంగా ఉండేది. బుమ్రాను సరైన సమయంలో బౌలింగ్ చేయించాని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే 17వ ఓవర్ వేయించి ఉంటే మరి తొందరయ్యేది.
ఆ సమయంలో 4 ఓవర్లలో పంజాబ్ విజయానికి 41 పరుగులు అవసరమయ్యాయి. ఆఖరి మూడు ఓవర్లలో బుమ్రాతో ఓవర్ వేయించాలని మేము ప్లాన్ చేశాము. 18 బంతులు మిగిలిఉన్నప్పటికి బుమ్రా తన అనుభవంతో ప్రత్యేకంగా ఏదైనా చేయగలడు అని భావించాము.
కానీ దురదృష్టవశాత్తు మేము అనుకున్నది ఈ రోజు జరగలేదు" అని పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్లో పాండ్యా పేర్కొన్నాడు. ఇక మంగళవారం అహ్మదాబాద్ వేదికగా జరగనున్న తుది పోరులో పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనున్నాయి.