అఫ్గానిస్తాన్తో టీ20 సిరీస్కు ప్రకటించిన భారత జట్టు ఎంపికపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా పూర్తి ఫిట్నెస్ సాధించని వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా, నితీష్ కుమార్ రెడ్డిలను జట్టులోకి తీసుకోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ సుబ్రమణ్యం బద్రీనాథ్, హెడ్కోచ్ గౌతమ్ గంభీర్పై పరోక్షంగా సెటైర్లు వేశారు.
"హెడ్కోచ్కి ఇష్టమైన ఆటగాళ్లు మళ్లీ జట్టులోకి వచ్చేశారు. ముఖ్యంగా వాషింగ్టన్ సుందర్కు విపరీతమైన మద్దతు లభిస్తోంది, అతడు ఈ అవకాశాన్ని ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోవాలి. ఇక నితీష్ కుమార్ రెడ్డి విషయానికొస్తే.. అతడు గొప్ప ఆల్రౌండర్ అని నేను అనుకోవడం లేదు.
నా దృష్టిలో అతడు కేవలం ఒక బ్యాటర్ మాత్రమే, బౌలర్గా పరిగణించలేం" అని బద్రీనాథ్ పేర్కొన్నాడు. కాగా గంభీర్ మద్దతు వల్లే హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్లకు అన్ని ఫార్మాట్లలో చోటు దక్కుతోందనే విమర్శలు ఉన్న సంగతి తెలిసిందే.
ఇక బుమ్రా రీఎంట్రీపై కూడా బధ్రీనాథ్ స్పందించాడు. "బుమ్రా తిరిగి రావడం చాలా సానుకూల పరిణామం. బమ్రానే స్వయంగా ఈ మూడు మ్యాచ్ల సిరీస్ ఆడుతాడని మేనెజ్మెంట్తో చెప్పి ఉండవచ్చు. దాంతో వారు అతడిని ఎంపిక చేసి ఉంటారని" ఈ తమిళనాడు క్రికెటర్ అన్నాడు. అఫ్గాన్-భారత్ మధ్య మూడు మ్యాచ్ల సిరీస్ సెప్టెంబర్ 13 నుంచి ప్రారంభం కానుంది.
అఫ్గాన్తో సిరీస్కు భారత జట్టు: శ్రేయస్ అయ్యర్, అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, శివమ్ దూబె, నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్, హర్షిత్ రాణా
చదవండి: డుప్లెసిస్ విధ్వంసం.. అశ్విన్ టీమ్కు నాలుగో ఓటమి


