Virat Kohli Equals Mahendra Singh Dhoni's Record, Becomes Joint Most Successful India Test Captain At Home - Sakshi
Sakshi News home page

ధోని రికార్డు సమం.. కోహ్లి ఖాతాలోనే ఐదు

Feb 16 2021 4:44 PM | Updated on Feb 16 2021 6:39 PM

Five Of The Top Six Test Wins Coming Under Virat Kohlis Captaincy - Sakshi

విరాట్‌ కోహ్లి-ధోని(ఫైల్‌ఫోటో)

చెన్నై: ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టులో టీమిండియా 317 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. తొలుత ఇంగ్లండ్‌కు 482 పరుగుల భారీ టార్గెట్‌ను నిర్దేశించిన టీమిండియా.. ఆపై రూట్‌ సేనను రెండో ఇన్నింగ్స్‌లో 164 పరుగులకే కుప్పకూల్చి ఘనమైన గెలుపును అందుకుంది. ఇది టీమిండియా టెస్టు చరిత్రలో ఐదో పెద్ద విజయంగా రికార్డులకెక్కింది. ఇదిలా ఉంచితే, ఇంగ్లండ్‌పై భారత్‌కు ఇదే అతి పెద్ద విజయం కావడం విశేషం. 1986లో  లీడ్స్‌లో జరిగిన టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై 279 పరుగుల తేడాతో విజయం సాధించిన టీమిండియా.. 34 ఏళ్ల తర్వాత అతి పెద్ద గెలుపును నమోదు చేసింది.  

ధోని సరసన కోహ్లి
మరొకవైపు భారత్‌లో అత్యధిక టెస్టు విజయాలు సాధించిన టీమిండియా కెప్టెన్ల జాబితాలో ఎంఎస్‌ ధోని సరసన కోహ్లి నిలిచాడు. ఇంగ్లండ్‌పై తాజా విజయంతో భారత్‌లో కెప్టెన్‌గా కోహ్లి సాధించిన విజయాల సంఖ్య 21కు చేరింది. అంతకుముందు ధోని నేతృత్వంలోని టీమిండియా కూడా భారత్‌లో 21 టెస్టు విజయాలనే నమోదు చేసింది. దాంతో ధోని రికార్డును సమం చేశాడు కోహ్లి. భారత్‌లో కోహ్లి 28 టెస్టులకు సారథ్యం వహించి 21 విజయాలు నమోదు చేశాడు. ఇక ఐదు మ్యాచ్‌లను డ్రా చేసుకోగా, రెండు మ్యాచ్‌ల్లో ఓటమి ఎదురైంది. కాగా, ధోని సారథ్యంలో టీమిండియా.. భారత్‌లో 30 మ్యాచ్‌లు ఆడి 21 విజయాలను అందుకుంది. మూడు ఓటములు, ఆరు డ్రాలు ధోని ఖాతాలో ఉన్నాయి. 

ఐదు అతి పెద్ద విజయాలు కోహ్లి ఖాతాలోనే
భారత జట్టు ఇప్పటివరకూ మూడొందలు అంతకంటే ఎక్కువ పరుగుల తేడాతో ఆరు విజయాల్ని నమోదు చేసింది. పరుగుల పరంగా ఈ ఆరు అతిపెద్ద విజయాల్లో ఐదు గెలుపులు కోహ్లి ఖాతాలోనే చేరాయి. ఇక్కడ కేవలం ఒక్కటి మాత్రమే ధోని ఖాతాలో ఉంది. 2008-09 సీజన్‌లో మొహాలీలో ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 320 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇక టాప్‌-6 అతిపెద్ద టెస్టు విజయాల్లో మిగిలిన ఐదు విజయాలు కోహ్లి కెప్టెన్సీలోనే వచ్చాయి. 2015-16 సీజన్‌లో ఢిల్లీలో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టులో టీమిండియా 337 పరుగుల తేడాతో విజయం సాధించగా, 2016-17 సీజన్‌లో ఇండోర్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 321 పరుగుల తేడాతో భారత్‌ గెలుపొందింది. 2019లో నార్త్‌ సౌండ్‌లో వెస్టిండీస్‌తో జరిగిన టెస్టులో టీమిండియా 318 పరుగులతో గెలుపును అందుకోగా, 2017లో శ్రీలంకతో గాలేలో జరిగిన మ్యాచ్‌లో 304 పరుగుల తేడాతో విజయం సాధించింది. తాజాగా ఇంగ్లండ్‌తో 317 పరుగుల తేడాతో భారత్‌ గెలిచింది.

 ఇక్కడ చదవండి: 

34 ఏళ్ల తర్వాత టీమిండియా..రూట్‌ తొలిసారి

టీమిండియాకు ఒకటి.. ఇంగ్లండ్‌కు మాత్రం రెండు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement