Virushka: అనంత్‌- రాధిక ప్రీ వెడ్డింగ్‌ వేడుకలకు కోహ్లి?! | Fact Check: Is Virat Kohli, Anushka Attending Anant Ambani's Pre-Wedding | Sakshi
Sakshi News home page

‘రాజు- రాణి వచ్చేశారు’.. అనంత్‌- రాధిక ప్రీ వెడ్డింగ్‌ వేడుకలకు కోహ్లి?! నిజం ఇదే

Mar 2 2024 1:43 PM | Updated on Mar 2 2024 2:02 PM

Fact Check: Is Virat Kohli Anushka Attending Anant Ambanis Pre Wedding - Sakshi

రాధిక- అనంత్‌-- విరాట్‌- అనుష్క (PC: Manav Manglani)

భారత కుబేరుడు ముకేశ్‌ అంబానీ- నీతా దంపతుల చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ- రాధికా మర్చంట్‌ ముందస్తు పెళ్లి వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. క్రీడా, సినీ సెలబ్రిటీలు.. వ్యాపార దిగ్గజాలు మూడు రోజుల పాటు జరిగే ప్రి వెడ్డింగ్‌ సెలబ్రేషన్స్‌లో భాగమయ్యేందుకు ప్రపంచం నలుమూలల నుంచి తరలివస్తున్నారు.

గుజరాత్‌లోని జామ్‌నగర్‌కు విచ్చేసి అంబానీ కుటుంబ ఆతిథ్యాన్ని స్వీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో సోషల్‌ మీడియాలో ఎక్కడ చూసినా ఈ సంబరాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలే దర్శనమిస్తున్నాయి.

ఈ క్రమంలో టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లి గురించి ఓ వార్త వైరల్‌ అవుతోంది. ‘‘విరాట్‌ కోహ్లి- అనుష్క శర్మ.. అనంత్‌ అంబానీ- రాధికా మర్చంట్‌ పెళ్లి వేడుకలకు హాజరయ్యేందుకు వెళ్తున్నారు. రాజు- రాణి వచ్చేశారు’’ అంటూ ఎయిర్‌పోర్టులో కోహ్లి- అనుష్క దంపతులు నిల్చుని ఉన్న ఫొటోను షేర్‌ చేస్తున్నారు.

అయితే, ఇది పాత ఫొటో. గతేడాది జూన్‌లో ఈ జంట ఎయిర్‌పోర్టు వద్ద ఫొటోలకు ఫోజులిచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియోను మానవ్‌ మంగ్లానీ అనే పాపరాజీ అప్పట్లో షేర్‌ చేశాడు. అయితే, తాజాగా కొంతమంది ఇందులోని ఫొటోలు గ్రాబ్‌ చేసి తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారు.

అనంత్‌ ప్రీ వెడ్డింగ్‌ వేడుకలకు కోహ్లి వెళ్తున్నాడా?
విరాట్‌ కోహ్లి 2017లో బాలీవుడ్‌ నటి అనుష్క శర్మను పెళ్లాడాడు. ఇటలీ వేదికగా పెళ్లి జరుగగా.. ముంబైలో రిసెప్షన్‌ పార్టీ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి నీతా అంబానీ పెద్ద కుమారుడు ఆకాశ్‌ అంబానీతో కలిసి హాజరయ్యారు. అయితే, ప్రస్తుతం అనంత్‌ అంబానీ ప్రి వెడ్డింగ్‌ వేడులకు కోహ్లి దంపతులు హాజరుకావడం లేదని సమాచారం.

ఇటీవలే అనుష్క శర్మ లండన్‌లో తమ రెండో సంతానం అకాయ్‌కు జన్మనిచ్చింది. ఈ క్రమంలో ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు దూరమైన విరాట్‌.. కుటుంబంతో కలిసి లండన్‌లోనే ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో జామ్‌నగర్‌కు విరుష్క జోడీ రావడం లేదని తెలుస్తోంది.

ఇక ఇప్పటికే క్రికెట్‌ సూపర్‌స్టార్లు సచిన్‌ టెండుల్కర్‌, మహేంద్ర సింగ్‌ ధోని, రోహిత్‌ శర్మ, హార్దిక్‌ పాండ్యా, సూర్యకుమార్‌ యాదవ్‌, డ్వేన్‌ బ్రావో, నికోలస్‌ పూరన్‌ తదితరులు అంబానీ ఇంట సంబరాల్లో పాల్గొనేందుకు గుజరాత్‌కు విచ్చేశారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement