ఇంగ్లండ్‌ మహిళల జోరు

England Womens Cricket Team Won Against West Indies Team - Sakshi

47 పరుగులతో వెస్టిండీస్‌పై గెలుపు 

డెర్బీ: వెస్టిండీస్‌ మహిళలతో జరుగుతోన్న ఐదు టి20 మ్యాచ్‌ల సిరీస్‌లో ఆతిథ్య ఇంగ్లండ్‌ మహిళల జట్టు ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. బుధవారం అర్ధరాత్రి ముగిసిన రెండో టి20 మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ 47 పరుగుల తేడాతో వెస్టిండీస్‌పై విజయం సాధించింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. సారా గ్లెన్‌ (26; 4 ఫోర్లు), ఆమీ జోన్స్‌ (25; 1 ఫోర్, 1 సిక్స్‌), టామ్సిన్‌ బ్యూమోంట్‌ (21; 4 ఫోర్లు) రాణించారు. ప్రత్యర్థి బౌలర్లలో షకీరా సెల్మన్, స్టెఫానీ టేలర్‌ చెరో 2 వికెట్లు దక్కించుకున్నారు.

అనంతరం సాధారణ లక్ష్యఛేదనలో వెస్టిండీస్‌ తడబడింది. బౌలర్లు సోఫీ ఎకెల్‌స్టోన్‌ (2/19), సారా గ్లెన్‌ (2/24), మ్యాడీ విలియర్స్‌ (2/10) కట్టుదిట్టంగా బంతులేయడంతో వెస్టిండీస్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 104 పరుగులే చేసి పరాజయం పాలైంది. డాటిన్‌ (40 బంతుల్లో 38; 4 ఫోర్లు, 1 సిక్స్‌), కెప్టెన్‌ స్టెఫానీ టేలర్‌ (31 బంతుల్లో 28; 4 ఫోర్లు) మినహా మిగతా బ్యాట్స్‌మెన్‌ సింగిల్‌ డిజిట్‌ స్కోరుకే పరిమితమయ్యారు. ఇరు జట్ల మధ్య మూడో టి20 మ్యాచ్‌ శనివారం జరుగనుంది. ఆరు నెలల తర్వాత ఈ రెండు జట్ల మధ్య టి20 సిరీస్‌తో అంతర్జాతీయ మహిళల క్రికెట్‌ పునః ప్రారంభమైంది.    

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top