
మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్తో ఇవాళ (జులై 23) మొదలైన తొలి టెస్ట్లో టీమిండియా ఓపెనింగ్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఓ అరుదైన ఘనత సాధించాడు. ఈ మ్యాచ్లో 28 పరుగుల వద్ద రాహుల్ ఇంగ్లండ్ గడ్డపై 1000 పరుగులు పూర్తి చేసుకున్నాడు.
తద్వారా ఈ ఘనత సాధించిన ఐదో భారత బ్యాటర్గా.. రెండో భారత ఓపెనర్గా రికార్డుల్లోకెక్కాడు. రాహుల్కు ముందు దిగ్గజ బ్యాటర్లు సచిన్ టెండూల్కర్ (1575), రాహుల్ ద్రవిడ్ (1376), సునీల్ గవాస్కర్ (1152), విరాట్ కోహ్లి (1096) మాత్రమే ఈ ఘనత సాధించారు. వీరిలో గవాస్కర్ ఒక్కరే ఓపెనర్.
మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్లో రాహుల్ 46 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔటయ్యాడు. క్రిస్ వోక్స్ బౌలింగ్లో జాక్ క్రాలేకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఈ మ్యాచ్లో భారత్ టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగింది. రాహుల్ ఔటయ్యే సమయానికి (30 ఓవర్లు) భారత్ స్కోర్ 94/1గా ఉంది. యశస్వి జైస్వాల్ 45 పరుగులతో కొనసాగుతుండగా.. అతనికి జతగా సాయి సుదర్శన్ క్రీజ్లోకి వచ్చాడు.
భీకరమైన ఫామ్లో రాహుల్
ప్రస్తుత ఇంగ్లండ్ పర్యటనలో రాహుల్ భీకరమైన ఫామ్లో ఉన్నాడు. 7 ఇన్నింగ్స్ల్లో 2 సెంచరీలు, ఓ హాఫ్ సెంచరీ సాయంతో 421 పరుగులు చేసి లీడింగ్ రన్స్కోరర్ల జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు.
ఇదిలా ఉంటే, ఐదు మ్యాచ్ల ఈ సిరీస్లో భారత్ ప్రస్తుతం 1-2 తేడాతో వెనుకపడి ఉన్న విషయం తెలిసిందే. మొదటి, మూడు టెస్ట్ల్లో ఇంగ్లండ్ విజయం సాధించగా.. భారత్ రెండో మ్యాచ్లో గెలుపొందింది. ఈ మ్యాచ్లో గెలిస్తేనే భారత్ సిరీస్లో నిలబడుతుంది. కాబట్టి ఈ మ్యాచ్ భారత్కు డు ఆర్ డైగా మారింది.
తుది జట్లు..
ఇంగ్లండ్: జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జామీ స్మిత్ (వికెట్-కీపర్), లియామ్ డాసన్, క్రిస్ వోక్స్, బ్రైడన్ కార్సే, జోఫ్రా ఆర్చర్.
భారత్: యశస్వి జైస్వాల్, KL రాహుల్, సాయి సుదర్శన్, శుభమన్ గిల్, రిషబ్ పంత్ (WK),రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, అన్షుల్ కంబోజ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.