
PC: BCCI/IPL.com
ఐపీఎల్-2025 (IPL 2025) లో ఢిల్లీ క్యాపిటల్స్ అదరగొడుతోంది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా బుధవారం రాజస్తాన్ రాయల్స్తో జరిగిన ఉత్కంఠ పోరులో సూపర్ ఓవర్లో ఢిల్లీ విజయం సాధించింది. దీంతో అక్షర్ సేన మళ్లీ పాయింట్ల పట్టికలో అగ్రస్ధానానికి చేరుకుంది.
అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ-రాజస్తాన్ మధ్య జరిగిన ఈ పోరు.. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఉత్కంఠభరితమైన మ్యాచ్లలో ఒకటిగా నిలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది.
అనంతరం చిన్న చిన్న తప్పిదాల వల్ల రాజస్తాన్ కూడా సరిగ్గా 188 పరుగులే చేసింది. దీంతో మ్యాచ్ సూపర్ ఓవర్కు దారితీసింది. సూపర్ ఓవర్లో కూడా రాజస్తాన్ తీరు ఏ మాత్రం మారలేదు. అనవసరంగా రెండు రనౌట్లు అయ్యి మరో రెండు బంతులు మిగిలూండగానే ఇన్నింగ్స్ ముగించింది.
సూపర్ ఓవర్లో రాయల్స్ 11 పరుగులు చేసింది. ఆ తర్వాత ఢిల్లీ 12 పరుగుల టార్గెట్ను నాలుగు బంతుల్లోనే ఛేదించింది. ఇక సూపర్ ఓవర్లో విజయం సాధించిన ఢిల్లీ క్యాపిటల్స్ ఓ అరుదైన ఘనతను తమ పేరిట లిఖించుకుంది.
తొలి జట్టుగా..
ఐపీఎల్లో సూపర్ ఓవర్లలో అత్యధిక సార్లు విజయం సాధించిన జట్టుగా ఢిల్లీ క్యాపిటల్స్ చరిత్ర సృష్టించింది. ఇప్పటివరకు 5 సార్లు సూపర్ ఓవర్లు ఆడిన ఢిల్లీ.. అందులో నాలుగింట విజయం సాధించింది. 2013 సీజన్లో ఆర్సీబీపై ఒక్కసారే ఓటమి పాలైంది. ఇంతకుముందు ఈ రికార్డు పంజాబ్ కింగ్స్(3) పేరిట ఉండేది. తాజా మ్యాచ్తో పంజాబ్ను ఢిల్లీ అధిగమించింది.
ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సూపర్ ఓవర్ విజయాలు సాధించిన జట్లు ఇవే..
ఢిల్లీ క్యాపిటల్స్-4
పంజాబ్ కింగ్స్-3
ముంబై ఇండియన్స్-2
రాజస్తాన్ రాయల్స్-2
ఆర్సీబీ-2
చదవండి: అతడు చేసిన తప్పేంటి?.. మీకసలు తెలివి ఉందా?: షేన్ వాట్సన్ ఫైర్