Davis Cup: భారత్‌ పరాజయం

Davis Cup: India to play playoffs after suffering 3-0 loss to Norway - Sakshi

లిల్లీహ్యామర్‌ (నార్వే): డేవిస్‌కప్‌ టీమ్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో భారత జట్టు వరల్డ్‌ గ్రూప్‌ క్వాలిఫయర్స్‌కు అర్హత సాధించలేకపోయింది. నార్వే జట్టుతో జరిగిన వరల్డ్‌ గ్రూప్‌–1 పోటీలో భారత్‌ 1–3తో ఓడిపోయింది. మూడో మ్యాచ్‌గా శనివారం జరిగిన డబుల్స్‌ మ్యాచ్‌లో సాకేత్‌ మైనేని–యూకీ బాంబ్రీ జోడీ 3–6, 6–3, 3–6తో కాస్పర్‌ రూడ్‌–విక్టర్‌ దురాసోవిచ్‌ (నార్వే) ద్వయం చేతిలో ఓడిపోవడంతో భారత ఓటమి ఖరారైంది.

అంతకుముందు శుక్రవారం అర్ధరాత్రి దాటాక ముగిసిన రెండో సింగిల్స్‌ మ్యాచ్‌లో రామ్‌కుమార్‌ రామనాథన్‌ 1–6, 4–6తో దురాసోవిచ్‌ చేతిలో పరాజయం చవిచూశాడు. ఫలితం తేలిపోయాక నాలుగో మ్యాచ్‌లో సుమిత్‌ నగాల్‌ 6–2, 6–1తో లుకాస్‌ హెలమ్‌ (నార్వే)ను ఓడించాడు. తుది ఫలితంతో మార్పు ఉండే అవకాశం లేకపోవడంతో ఐదో మ్యాచ్‌ను నిర్వహించలేదు. భారత్‌ వచ్చే ఏడాది వరల్డ్‌ గ్రూప్‌–1లో చోటు కోసం ప్లే ఆఫ్‌ మ్యాచ్‌ ఆడుతుంది. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top