
రంజీ ట్రోఫీ 2024-25లో భాగంగా రాజ్కోట్ వేదికగా అస్సాంతో జరుగుతున్న మ్యాచ్లో సౌరాష్ట్ర దిగ్గజం ఛతేశ్వర్ పుజారా(Cheteshwar Pujara)ను దురదృష్టం వెంటాడింది. తొలి ఇన్నింగ్స్లో పుజారా ఒక్క పరుగు దూరంలో 67వ ఫస్ట్ క్లాస్ సెంచరీని మిస్ చేసుకున్నాడు.
పుజారా 99 పరుగుల వద్ద ముక్తర్ హూస్సేన్ బౌలింగ్లో ఔటయ్యాడు. ఏ బ్యాటర్కైనా ఒక్క పరుగు దూరంలో ఔటైతే ఆ బాధ వర్ణనాతీతం. ఈ డూ ఆర్ డై మ్యాచ్లో తన అద్భుత ఇన్నింగ్స్తో సౌరాష్ట్రను పటిష్ట స్ధితిలో ఉంచాడు. 167 బంతుల్లో 10 ఫోర్ల సాయంతో 99 పరుగులు చేసి పుజారా పెవిలియన్కు చేరాడు.
కాగా తొలి ఇన్నింగ్స్లో సౌరాష్ట్ర భారీ స్కోర్ దిశగా సాగుతోంది. 109 ఓవర్లు ముగిసే సరికి 7 వికెట్ల నష్టానికి సౌరాష్ట్ర 442 పరుగులు చేసింది. సౌరాష్ట్ర ఇన్నింగ్స్లో హర్విక్ దేశాయ్(130), చిరాగ్ జానీ(80) రాణించారు.
ఫస్ట్క్లాస్ క్రికెట్లో అదుర్స్..
ఇక ఇప్పటివరకు 276 ఫస్ట్క్లాస్ మ్యాచ్లు ఆడిన పుజారా.. 51.89 సగటుతో 21174 పరుగులు చేశాడు. అతడి ఫస్ట్క్లాస్ కెరీర్లో 66 సెంచరీలు, 80 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అదేవిధంగా టెస్టు క్రికెట్లో ఇప్పటివరకు 103 మ్యాచ్లు ఆడిన ఛతేశ్వర్.. 43.60 సగటుతో 7195 పరుగులు చేశాడు.
అతడి ఇన్నింగ్స్లలో 19 సెంచరీలు, 35 హాఫ్సెంచరీలు ఉన్నాయి. పుజారా చివరగా భారత్ తరపున 2023 ఏడాదిలో ఆస్ట్రేలియాతో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆడాడు.
పాపం రహానే..
మరోవైపు మేఘాలయతో జరుగుతున్న ముంబై కెప్టెన్ అజింక్య రహానే(Ajinkya Rahane) కూడా తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. రెండో ఇన్నింగ్స్లో 96 పరుగుల వద్ద రహానే ఔటయ్యాడు. నఫీస్ సిద్ధిక్ బౌలింగ్లో భారీ షాట్కు ప్రయత్నించి రహానే తన వికెట్ను కోల్పోయాడు.
ముంబై తొలి ఇన్నింగ్స్లో 76 ఓవర్లు ముగిసే సరికి 3 వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది. రహానే టీమ్ ప్రస్తుతం 172 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. అంతకముందు మేఘాలయ తమ తొలి ఇన్నింగ్స్లో కేవలం 86 పరుగులకే కుప్పకూలింది.
చదవండి: దినేష్ కార్తీక్ విధ్వంసం.. హ్యాట్రిక్ సిక్స్లతో హాఫ్ సెంచరీ! వీడియో