క్వార్టర్‌ ఫైనల్లో బోపన్న జోడీ | Bopanna pair in quarterfinals | Sakshi
Sakshi News home page

క్వార్టర్‌ ఫైనల్లో బోపన్న జోడీ

Apr 11 2025 3:56 AM | Updated on Apr 11 2025 3:56 AM

Bopanna pair in quarterfinals

మోంటెకార్లో (మొనాకో): భారత టెన్నిస్‌ డబుల్స్‌ దిగ్గజ ప్లేయర్‌ రోహన్‌ బోపన్న మోంటెకార్లో ఓపెన్‌  మాస్టర్స్‌ సిరీస్‌–1000 టోర్నీలో క్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. అమెరికా రైజింగ్‌ స్టార్‌ బెన్‌ షెల్టన్‌తో జత కట్టి ఈ టోర్నీలో బరిలోకి దిగిన బోపన్న ప్రిక్వార్టర్‌ ఫైనల్లో మూడో సీడ్‌ సిమోన్‌ బొలెలీ–ఆండ్రియా వావాసోరి (ఇటలీ) జోడీకి షాక్‌ ఇచ్చాడు. 96 నిమిషాలపాటు జరిగిన ప్రిక్వార్టర్‌ ఫైనల్లో బోపన్న–షెల్టన్‌ ద్వయం 2–6, 7–6 (7/4), 10–7తో ‘సూపర్‌ టైబ్రేక్‌’లో బొలెలీ–వావాసోరి జోడీని బోల్తా కొట్టించింది. 

మూడు ఏస్‌లు సంధించిన బోపన్న–షెల్టన్‌ ఐదు డబుల్‌ ఫాల్ట్‌లు చేశారు. తమ సర్వీస్‌ను మూడుసార్లు కోల్పోయిన ఈ ఇండో–అమెరికన్‌ జంట ప్రత్యర్థి సర్వీస్‌ను ఒకసారి బ్రేక్‌ చేసింది. క్వార్టర్‌ ఫైనల్లో మాన్యుయెల్‌ గినార్డ్‌ (ఫ్రాన్స్‌)–రొమైన్‌ అర్నియోడో (మొనాకో)లతో బోపన్న–షెల్టన్‌ తలపడతారు. ఈ ఏడాది ఏడో టోర్నీలో ఆడుతున్న బోపన్న ప్రస్తుతం మోంటెకార్లో ఓపెన్‌లో, దోహా ఓపెన్‌లో మాత్రమే క్వార్టర్‌ ఫైనల్‌ చేరుకున్నాడు.   

సాకేత్‌–రామ్‌కుమార్‌ జంట పరాజయం 
సాక్షి, హైదరాబాద్‌: మాడ్రిడ్‌ ఓపెన్‌ ఏటీపీ చాలెంజర్‌–100 టెన్నిస్‌ టోర్నీ పురుషుల డబుల్స్‌ విభాగంలో భారత క్రీడాకారుల కథ ముగిసింది. భారత డేవిస్‌ కప్‌ జట్టు సభ్యుడు, ఆంధ్రప్రదేశ్‌ ప్లేయర్‌ సాకేత్‌ మైనేని, హైదరాబాద్‌ ప్లేయర్‌ అనిరుధ్‌ చంద్రశేఖర్, భారత ప్లేయర్‌ సిద్ధాంత్‌ బంతియా వేర్వేరు భాగస్వాములతో ఈ టోర్నీలో పోటీపడ్డారు. 

స్పెయిన్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో గురువారం జరిగిన పురుషుల డబుల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో సాకేత్‌–రామ్‌కుమార్‌ రామనాథన్‌ (భారత్‌) జంట 2–6, 4–6తో మూడో సీడ్‌ ఫ్రాన్సిస్కో కబ్రాల్‌ (పోర్చుగల్‌)–లుకాస్‌ మిడ్లెర్‌ (ఆ్రస్టియా) జోడీ చేతిలో ఓడిపోయింది. మరో క్వార్టర్‌ ఫైనల్లో అనిరుధ్‌ (భారత్‌)–డేవిడ్‌ వేగా హెర్నాండెజ్‌ (స్పెయిన్‌) జోడీ 4–6, 2–6తో ఇనిగో సెర్వాంటెస్‌ (స్పెయిన్‌)–డెనిస్‌ మొల్చనోవ్‌ (ఉక్రెయిన్‌) జంట చేతిలో పరాజయం పాలైంది. 

మరో క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో సిద్ధాంత్‌ బంతియా (భారత్‌)–అలెగ్జాండర్‌ డాన్‌స్కీ (బల్గేరియా) ద్వయం 6–7 (2/7), 6–7 (4/7)తో ఒర్లాండో లుజ్‌ (బ్రెజిల్‌)–అల్బానో ఒలివెట్టి (ఫ్రాన్స్‌) జంట చేతిలో ఓటమి పాలైంది. క్వార్టర్‌ ఫైనల్లో ఓడిన సాకేత్, అనిరుధ్, సిద్ధాంత్‌ జోడీలకు 1,470 యూరోల (రూ. 1 లక్ష 42 వేలు) చొప్పున ప్రైజ్‌మనీతోపాటు 20 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి.   

రిత్విక్‌ ద్వయం శుభారంభం
3మెక్సికో సిటీ: భారత పురుషుల టెన్నిస్‌ డబుల్స్‌ నాలుగో ర్యాంకర్‌ బొల్లిపల్లి రిత్విక్‌ చౌదరీ మెక్సికో సిటీ ఓపెన్‌ ఏటీపీ చాలెంజర్‌–125 టోర్నమెంట్‌లో శుభారంభం చేశాడు. గురువారం జరిగిన పురుషుల డబుల్స్‌ తొలి రౌండ్‌లో రెండో సీడ్‌ రిత్విక్‌ (భారత్‌)–నికోలస్‌ బరియంతోస్‌ (కొలంబియా) ద్వయం 3–6, 6–3, 10–7తో ‘సూపర్‌ టైబ్రేక్‌’లో రే హో (చైనీస్‌ తైపీ)–క్రిస్టోఫర్‌ రొమియోస్‌ (ఆ్రస్టేలియా) జంటను ఓడించి క్వార్టర్‌ ఫైనల్‌ చేరింది. 

78 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రిత్విక్‌–బరియంతోస్‌ ద్వయం రెండు ఏస్‌లు సంధించి, ఆరు డబుల్‌ ఫాల్ట్‌లు చేసింది. తొలి సర్వ్‌లో 38 పాయింట్లకుగాను 29 పాయింట్లు, రెండో సర్వ్‌లో 24 పాయింట్లకుగాను 11 పాయింట్లు సాధించింది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement