పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తీరుపై విమర్శలు కొనసాగుతున్నాయి. జింబాబ్వే పేసర్ బ్లెస్సింగ్ ముజర్బానీ పట్ల పీసీబీ వ్యవహారశైలి ఇందుకు కారణం. టీ20 ప్రపంచకప్-2026లో ఆస్ట్రేలియా జట్టుపై సత్తా చాటడంతో ముజర్బానీకి ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది.
ఈ నేపథ్యంలో పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL)కు చెందిన ఇస్లామాబాద్ యునైటెడ్ ఫ్రాంఛైజీ ముజర్బానీని సొంతం చేసుకునే దిశగా ప్రయత్నాలు చేసింది. వెస్టిండీస్ యువ పేసర్ షమార్ జోసెఫ్ స్థానంలో ఈ జింబాబ్వే పేసర్ను తమ జట్టులోకి తీసుకుంటున్నట్లు ప్రకటించింది.
కేకేఆర్లో చేరిన ముజర్బానీ
అయితే.. ఆ తర్వాత అనూహ్య రీతిలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) నుంచి ముజర్బానీకి పిలుపువచ్చింది. బంగ్లాదేశ్తో ఉద్రికత్తల నేపథ్యంలో తమ జట్టు నుంచి తొలగించిన ఫాస్ట్ బౌలర్ ముస్తాఫిజుర్ రహమాన్ స్థానాన్ని కోల్కతా నైట్ రైడర్స్.. ముజర్బానీతో భర్తీ చేయాలని భావించింది.
రెండేళ్ల నిషేధం
ఈ నేపథ్యంలో ఐపీఎల్ వైపు మొగ్గుచూపిన ముజర్బానీ.. పీఎస్ఎల్ను వీడి కేకేఆర్లో చేరాడు. దీంతో పీసీబీ సంచలన ప్రకటన చేసింది. ‘‘ఫ్రాంచైజీ లీగ్లలో ఆడేవాళ్లు పారదర్శకంగా, స్థిరంగా ఉండాలి. ముందుగా ఒప్పందం కుదుర్చుకొని అది అమలులో ఉండగా... దానికి విరుద్ధమైన ఒప్పందంలోకి ప్రవేశించడం ఆట ప్రమాణాలను పాటించకపోవడమే. ముజర్బానీపై రెండేళ్లు నిషేధం విధిస్తున్నాం’’ అని పేర్కొంది. దీంతో అతడిపై పాక్ ఫ్యాన్స్ విద్వేష విషం చిమ్మారు.
ఈ క్రమంలో ముజర్బానీ ఏజెంట్ తాజాగా ఘాటుగా స్పందించాడు. అసలు ముజర్బానీ ఏ కాంట్రాక్టుపైనా సంతకం చేయలేదని.. అలాంటి ఆటగాడిపై నిషేధం ఎలా విధిస్తారని ప్రశ్నించాడు.
అంతేకాదు.. అభిమానుల ముసుగులో పిరికిపందలు అతడిపై విషం చిమ్ముతూ ఉంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించాడు. అకారణంగా బ్లెస్సింగ్పై చర్యలు తీసుకున్నారని.. వెంటనే నిషేధం ఎత్తివేయాలని పీసీబీకి విజ్ఞప్తి చేశాడు.
తప్పు ఒప్పుకొన్న పాక్ బోర్డు.. ఊహించని ట్విస్ట్!
దీంతో వివాదం ముదిరిపోగా.. పీసీబీ స్పందించినట్లు తెలుస్తోంది. PTI అందించిన వివరాల ప్రకారం.. ముజర్బానీ ఏజెంట్ చేసిన ఆరోపణలు నిజమేనని పీసీబీ ధ్రువీకరించింది. పీసీబీ గానీ.. ఇస్లామాబాద్ గానీ ఈ జింబాబ్వే పేసర్తో రాతపూర్వక ఒప్పందం చేసుకోలేదని అంగీకరించింది.
అయితే, మౌఖికంగా మాత్రం అతడు పీఎస్ఎల్లో ఆడేందుకు ఆమోదం తెలిపాడని పేర్కొంది. ఏదేమైనా ముజర్బానీ నిబంధనలను ఉల్లంఘించాడని.. అందుకే అతడిపై నిషేధం కొనసాగుతుందని పీసీబీ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో పీసీబీ తప్పును సగమే ఒప్పుకొందని.. అకారణంగా ముజర్బానీపై చర్యలు తీసుకుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా ముజర్బానీతో పాటు ఈ ఏడాది శ్రీలంక కెప్టెన్ దసున్ షనక, ఆస్ట్రేలియా స్టార్ స్పెన్సర్ జాన్సన్ కూడా పీఎస్ఎల్ను వీడి ఐపీఎల్లో చేరిన సంగతి తెలిసిందే.
చదవండి: టీ20 క్రికెట్ లీగ్ ఫ్రాంఛైజీ ఓనర్గా క్రిస్ గేల్


